నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
ఎస్పీతో కలిసి పదో తరగతి పరీక్షా కేంద్రాల పరిశీలన
నిర్మల్ అర్బన్, మే 20 : పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. ఈ నెల 23 నుంచి జిల్లాలో నిర్వహించనున్న పదో తరగతి పరీక్షా కేంద్రాలను శుక్రవారం ఎస్పీ ప్రవీణ్ కుమార్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. పట్టణంలోని చాణక్య పాఠశాలలో ఏర్పాట్లు, వసతులపై ఆరాతీశారు. ప్రతి తరగతి గదిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని సూచించారు. తాగునీరు, ఫ్యాన్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. విద్యార్థులు, సిబ్బంది ఎవరూ పరీక్షా కేంద్రాలకు మొబైల్ ఫోన్లు తీసుకురావద్దని ఆదేశించారు. ప్రశ్నాపత్రాలు లీక్ అయితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే గదులను తనిఖీ చేసి ఫర్నిచర్, విద్యుత్ సదుపాయం కల్పించేలా చూడాలన్నారు. పరీక్షలకు ముందు అన్ని గదులను శానిటైజ్ చేయాలని, కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. వీరి వెంట అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, డీఈవో రవీందర్ రెడ్డి, పద్మ ఉన్నారు.
పచ్చదనం మరింత పెంచాలి
సోన్, మే 20 : సోన్ జాతీయ రహదారికి ఇరువైపులా మరింత పచ్చదనం పెంచేలా చూడాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులకు సూచించారు. హరితహారంలో భాగంగా సోన్ నేషనల్ హైవేకు ఇరువైపులా నాటిన మొక్కలను పరిశీలించారు. మొక్కలపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. మొక్కల మధ్యలో దూరం బాగా ఉండకుండా చూసుకోవాలన్నారు. క్రమం తప్పకుండా నీరు పోయాలని ఎంపీడీవో సాయిరాంను ఆదేశించారు. అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, డీఆర్డీవో విజయలక్ష్మి, తహసీల్దార్ హేమబిందు ఉన్నారు.