నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
నిర్మల్ టౌన్, జూన్ 7 : ఈ నెల 12న నిర్వహించనున్న టెట్ను ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో టెట్ నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. నిర్మల్ జిల్లాలో 7734 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని వివరించారు. ఒకటో పేపర్కు 33 పరీక్షా కేంద్రాలు, రెండో పేపర్కు 22 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందని వివరించారు. 33 మంది జిల్లా స్థాయి అధికారుల ను చీఫ్ సూపరిండెంటెంట్లుగా, మరో 33 మంది డిపార్ట్మెంటల్ అధికారులుగా నియమించామని పేర్కొన్నారు. 612 మందిని ఇన్విజిలేటర్లుగా నియమించామని, పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ రాంబాబు, డీఈవో రవీందర్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.