నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 24 : నిర్మల్ జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో పట్టణ పణాళిక అభివృద్ధి పనులతో పాటు పట్టణ ప్రగతి పనులను వేగంగా పూర్తిచేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం పట్టణ ప్రగతి పనులపై అన్ని మున్సిపాలిటీ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయా మున్సిపాలిటీల్లో పట్టణ ప్రణాళిక అమలుకు తీసుకుంటున్న చర్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సద్వినియోగం చేసుకొని, పనులు చేపట్టాలని సూచించారు. అన్ని వార్డుల్లో పారిశుధ్య పనులతో పాటు సీసీ రోడ్లు, మురుగు కాలువలు నిర్మించాలని ఆదేశించారు. ఖాళీ ప్రదేశాలను గుర్తించి, అక్రమాలకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను పన్నులను వెంటనే వసూలు చేయాలన్నారు. అన్ని వార్డుల్లో చేపట్టిన పనులను పూర్తిచేసి, పెండింగ్ పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జిల్లా అధికారులు పాల్గొన్నారు.