రెబ్బెన, డిసెంబర్ 25: వ్యవసాయరంగంలో ప్రతీ సంవత్సరం కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కూలీల కొరత విపరీతంగా ఉండడంతో రైతులు యంత్రాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ప్రస్తుతం వరికోతలు మమ్మురంగా సాగుతుండడంతో వరికోత యంత్రాలకు గిరాకీ పెరిగింది. కూలీలకు బదులు యంత్రాలతో గంటల వ్యవధిలోనే పంట చేతికి వస్తుండడంతో రైతులు చాలా మంది యంత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వర్షాలు మంచిగా పడడంతో వరి సాగు బాగా పెరిగింది.
వరికోతలు ఒకేసారి రావడంతో కూలీలు దొరకక పొవడంతో యంత్రాలకు గిరాకీ పెరిగింది. వివిధ జిల్లాలు, పక్క రాష్ర్టాల నుంచి కూడా యంత్రాలు తీసుకరావడంతో రైతులు వరికోత యంత్రాలకు అడ్వాన్స్గా నగదు చెల్లించి పనులు చేయించుకుంటున్నారు. 1గంట కోతకు నార్మల్ టూ వీలర్ హార్వెస్టర్కు రూ.2,200 వేలు, ఫోర్వీల్ హార్వెస్టర్కు రూ.2,800 నుంచి రూ. 3,000లు, చైన్ ట్రాక్ హార్వెస్టర్కు రూ.3000 నుంచి 3500 రూపాయలు చార్జి చేస్తున్నారు.
తడిగా ఉండని పొలం గంటన్నర పడితే, బురద లేక తడిగా ఉండే పొలం 2గంటల సమయంలో కోస్తున్నారు. వరికోత యంత్రాల విధానమే బాగున్నప్పటికీ వరిగడ్డి అవసరం ఉన్న రైతులు మాత్రం యంత్రాల సహాయం తీసుకోకుండా కూలీల సహాయంతో కోతకోసి, కుప్పపెట్టి ధాన్యం తీస్తున్నారు. సీజన్ కావడంతో హార్వెస్టర్ కలిగిన యజమానులు గ్రామాల్లో పర్యటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
పొలాల్లో వరి పంట కోతకు సిద్ధ్దంగా ఉంది. కూలీల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. కోతలకు ఎవరూ రాకపోవడంతో వరి పంట చేలల్లోనే ఉంది. హార్వెస్టర్ యంత్రాలకు గిరాకీ ఎక్కువగా ఉండడంతో దొరకడం లేదు. పంట పొలాల్లో వరికోత కోసం రైతులు ఎదురు చుస్తున్నారు. కూలీలు దొరకక యంత్రాలు దొరకక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
-కుందారపు శంకరమ్మ, మహిళ రైతు, రెబ్బెన