‘ప్రజలే నా పంచ ప్రాణాలు. ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధే నా ధ్యేయం. ఉమ్మడి రాష్ట్రంలో విసిరి పడేసినట్టున్న సెగ్మెంట్ను ప్రగతి పథంలో నిలబెట్టా. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఏదీ అడిగినా కాదనకుండా ఇచ్చి సంపూర్ణంగా సహకరించారు. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎవరూ ఊహించని విధంగా ఐటీ టవర్, వ్యవసాయ కళాశాలతోపాటు ప్రస్తుతం జేఎన్టీయూ కళాశాలలు మంజూరయ్యాయి. 68 ఏండ్లలో ప్రతిపక్షాలు చేయని ప్రగతిని పదేండ్లలో చేసి చూపించాం. నియోజకవర్గ రూపురేఖలే మార్చేశాం. రూ.4,500 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తుండడం గొప్ప విజయం. సిమెంట్ కంపెనీ పునఃప్రారంభంపై బీజేపీ వివక్ష చూపుతున్నది. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో బీఆర్ఎస్ కీలకపాత్ర పోషించనుంది. సీసీఐని పునఃప్రారంభించి స్థానికులకు ఉపాధి కల్పిస్తాం. నన్ను మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నా..’ అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘నమస్తే’ తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఆదిలాబాద్, ఆగస్టు 22(నమస్తే తెలంగాణ) : ‘ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి నోచుకోలేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. 68 ఏండ్లలో చేయని అభివృద్ధిని పదేండ్లలో చేసి చూపించాం. రూ.4,500 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ఉమ్మడి జిల్లాకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేలా మెడికల్ కళాశాల, జేఎన్టీయూ ఇంజినీరింగ్, వ్యవసాయ కళాశాలలను ఏర్పాటు చేశాం. యువతకు ఉపాధి కల్పించేలా రూ.40 కోట్లతో ఐటీ టవర్ నిర్మిస్తున్నాం. ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను తిరిగి ప్రారంభించడంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో బీఆర్ఎస్ కీలకపాత్ర పోషిస్తున్నది. ప్రతిపక్షాలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయామని, ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో తాను విజయం సాధిస్తాననే ధీమా వ్యక్తం చేశారు. నాలుగోసారి తనకు ఆదిలాబాద్ అసెంబ్లీ టికెట్ కేటాయించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నా.’ అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
నమస్తే : అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరు వివరించండి?
జోగు రామన్న : నాకు నాలుగో సారి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్కు నా తరఫున, నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు. ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాతోపాటు నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. గతంలో పాలించిన ప్రతిపక్షాలు అభివృద్ధిని విస్మరించాయి. ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. పదేండ్లలో రూ.4,500 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. సీఎం కేసీఆర్ సారథ్యంలో 68 ఏండ్లలో జరగని అభివృద్ధిని పదేండ్లలో చేసి చూపించాం.
నమస్తే : విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు ఎలా అభివృద్ధి చెందాయి?
రామన్న : గత పాలకుల పట్టింపులేనితనంతో గిరిజనులు, పేదలకు చదువుకునే అవకాశం లభించలేదు. వైద్యసేవలు అందక మరణాలు సంభవించాయి. రైతులకు విత్తనాలు, ఎరువులు దొరికేవి కావు. ప్రత్యేక రాష్ట్రంలో ప్రభుత్వం పేద విద్యార్థుల చదువులకు పెద్దపీట వేస్తున్నది. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించడంలో భాగంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేసింది. విదేశాల్లో ఉన్నత చదువులకు ఆర్థిక సాయం అందిస్తున్నది. మలేరియా, టైఫాయిడ్, డెంగీ, డయేరియా వ్యాధులు ప్రజలను పట్టి పీడించేవి. పౌష్టికాహారం లేక గర్భిణులు ఇబ్బందులు పడేవారు. వైద్యరంగంలో ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తున్న ప్రణాళికల ఫలితంగా ఎనిమిదేండ్లుగా మరణాలు లేవు. గర్భిణులకు కేసీఆర్, న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేస్తున్నాం. గతంలో విత్తనాలు, ఎరువుల కోసం రైతులు లాఠీ దెబ్బలు తినాల్సిన పరిస్థితి ఉండేది.
నమస్తే : సాగునీటికి చేపట్టిన చర్యలు ఏమిటీ?
రామన్న : లోయర్ పెన్గంగ ప్రాజెక్టు నిర్మాణాన్ని 40 ఏళ్లుగా అప్ప టి పాలకులు పట్టించుకోలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన వెంటనే కేసీఆర్ మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వారిని ఒప్పించారు. ప్రస్తుతం ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకున్నాయి. ప్రాజెక్టుతో ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో 52 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. 24 వేల ఎకరాలకు సాగునీరు అందించే సాత్నాల ప్రాజెక్టు గత పాలకుల పట్టించుకోక ఎనిమిది వేల ఎకరాలకు పరిమితమైంది. ప్రభుత్వం ఆధునికీకరించడంతో చివరి ఆయకట్టుకు నీళ్లు పారుతున్నాయి. మిషన్ కాకతీయతో ఆరు వేల ఎకరాల ఆయకట్టు పెరిగింది. నియోజకవర్గంలో నిర్మించిన చెక్డ్యాంల ఫలితంగా భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి.
నమస్తే : ఉన్నత చదువులు, ఉపాధి కల్పించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు?
రామన్న : గతంలో నియోజకవర్గంలో విద్యార్థులు ఉన్నత చదువుల కోసం హైదరాబాద్, నాగ్పూర్, పూణె, బెంగళూరు లాంటి పట్టణాలకు వెళ్లేది. ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయ, సహకారాలతో జిల్లా విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకునే అవకాశం లభించింది. జిల్లాలో మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లను ప్రభుత్వం నియమించింది. జిల్లా కేంద్రంలో వ్యవసాయ కళాశాల మంజూరు చేయగా ఎంసెట్లో ఫలితాల ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వం మంగళవారం జిల్లాకు జేఎన్టీయూ ఇంజిరింగ్ కళాశాలను మంజూరు చేసిం ది. జిల్లాలో యువతకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం రూ.40 కోట్లతో ఐటీ టవర్ మంజూరు చేసింది. ఐదు వేల మందికి ఉపాధి కల్పించే ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను ప్రారంభించాలని ప్రజా ఆందోళనలు జరిగినా కేంద్రం ప్రభుత్వం పట్టించుకోలేదు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో బీఆర్ఎస్ కీలకపాత్ర పోషిస్తున్నది. సీసీఐని పునఃప్రారంభించి స్థానికులకు ఉపాధి కల్పిస్తాం.
నమస్తే : ప్రతిపక్షాల పరిస్థితి ఏమిటీ?
రామన్న : ప్రతిపక్షాలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయి. నేనంటే నేను ఎమ్మెల్యే అభ్యర్థిని అంటూ కాంగ్రెస్, బీజేపీ నాయకులు కొట్లాడుకుంటున్నారు. వారిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ను ప్రజలు ఆదరిస్తారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తా.