అకాల వర్షం అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు కోలుకోలేని దెబ్బ తీశాయి. వారం రోజుల్లో పంట ఉత్పత్తులు చేతికొస్తాయనగా వడగండ్ల వర్షం కురియడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడి కాయలు రాలిపోగా.. వరి, మక్క, జొన్న, నువ్వులు, పల్లి పంటలు నేలకొరిగాయి. ఆరుగాలం శ్రమించి పంట చేతికొస్తున్న సమయంలో నష్టం వాటిల్లడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 7479 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లగా.. ఇందులో ఆదిలాబాద్లో 2వేల ఎకరాలు, మంచిర్యాలలో 2379 ఎకరాలు, ఆసిఫాబాద్లో 3100 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ, ఉద్యానవనశాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పంటల నష్టాన్ని అంచనా వేశారు. నివేదికను ప్రభుత్వానికి పంపించారు. ఈ నేపథ్యంలో పంట నష్టంపై ‘నమస్తే తెలంగాణ’ క్షేత్రస్థాయి పరిశీలనాత్మక కథనం.
మంచిర్యాల(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నెన్నెల, ఏప్రిల్ 26 : కొన్ని రోజులుగా మంచిర్యాల జిల్లాలో మారిన వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు, ఈదురు గాలులు మామిడి, వరి సాగు చేసిన రైతులను ఆగం చేశాయి. ఆరుగాలం పడిన కష్టానికి పంట చేతికొస్తుందని సంబురపడుతున్న దశలోనే రైతుల ఆశలను ఈదురు గాలులు గల్లంతు చేశాయి. నాలుగు రోజులుగా ముఖ్యంగా మంగళవారం కురిసిన వర్షం, ఈదురుగాలులతో కోతకు వచ్చిన మామిడి కాయలు నేలరాలాయి. తోటల్లో రాలిన కాయలను కుప్పులు పోసిన రైతులు.. కోతులు, పందుల భారీ నుంచి కంచె వేసి మరీ కాపాడుకున్న పంట ఇప్పుడు పశువులు తినేందుకు కూడా పనికి రాకుండా పోయిందని రైతన్నలు వాపోతున్నారు. పలిగిన కాయలు చూపిస్తూ జరిగిన నష్టాన్ని చెప్పుకుంటున్నారు. రేపో మాపో కాయ కోసి విక్రయిస్తే కిలోకు రూ.40 వస్తాయనుకుంటే.. ఇప్పుడు ఈ రాలిన కాయ కిలోకు రూ.3 నుంచి రూ.4లు కూడా వచ్చేలా లేదని బోరున విలపిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో 17 వేల నుంచి 18 వేల హెక్టార్లలో మామిడి సాగు చేయగా.. గడిచిన ఐదు రోజులుగా వర్షం, ఈదురుగాలుల కారణంగా దాదాపు 4 వేల నుంచి 5 వేల హెక్టార్లలో కాయ రాలిపోయింది. ఇదే సమయంలో రెండు వేల పైచిలుకు ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు అధికారులు భావిస్తున్నారు. పంట నష్టాన్ని అంచనా వేసేందుకు జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పంట నష్టాలపై ‘నమస్తే తెలంగాణ’ క్షేత్రస్థాయి పరిశీలనాత్మక కథనం.
ఏడు మండలాల్లో తీవ్ర ప్రభావం..
మంచిర్యాల జిల్లాలోని 18 మండలాల్లో కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురు గాలులకు ఏడు మండలాల్లో పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. దండేపల్లి, మందమర్రి, బెల్లంపల్లి, తాండూర్, నెన్నెల, కన్నేపల్లి, జన్నారం మండలాల్లో పంటలు నష్టపోయినట్లు వ్యవసాయ, ఉద్యానవనశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఈ ఏడు మండలాల్లో జరిగిన పంట నష్టంపై అధికారిక గణాంకాలు ఇలా ఉన్నాయి. వరి 2,053 ఎకరాలు, జొన్న 17, మామిడి 309 ఎకరాల్లో మొత్తంగా 2,379 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. గడిచిన మూడు రోజుల్లో వర్షాలు, ఈదురుగాలుల తీవ్రత పెరిగిన నేపథ్యంలో పంట నష్టం కూడా భారీగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.30 వేల నష్టం..
మామిడి తోటలు అధికంగా ఉన్న నెన్నెల, జైపూర్, భీమారం, మందమర్రి, బెల్లంపల్లి, తాండూర్, హాజీపూర్ మండలాల్లో వందల ఎకరాల్లో నష్టం వాటిల్లింది. మొన్నటి గాలులకు ప్రతి ఎకరాకు మూడు నుంచి నాలుగు టన్నుల కాయలు రాలిపోయాయి. ఇప్పటి వరకు మూడు సార్లు ఈదురుగాలులు వీయగా.. ప్రతి ఎకరాకు సుమారు 25 నుంచి 30 శాతం కాయ రాలింది. దీంతో గిట్టుబాటు అయ్యే పరిస్థితులు లేవని రైతులు అంటున్నారు. కాయ రాలడంతో ఎకరాకు సగటున రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు నష్టపోయామని, మూడుసార్లు కోత సమయంలోనే గాలులు వచ్చాయని దీంతో మార్కెట్కు పోవాల్సిన కాయ ఎందుకూ పనికిరాకుండా పోయిందని వాపోతున్నారు. ఇప్పుడు చెట్ల మీద ఉన్న కాయ కోతకు వచ్చే సమయానికి మళ్లీ గాలులు వస్తే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. అధిక దిగుబడితోపాటు మంచి ధర పలికే బంగన్పల్లి, దసేరి, చెరుకు రసాలు ఎక్కువగా దెబ్బతిన్నాయంటున్నారు. మామిడితోపాటు దండేపల్లి, కోటపల్లి, చెన్నూర్, లక్షెట్టిపేట, మందమర్రి మండలాల్లో వరి నేలకొరిగింది. స్వల్ప వర్షాలే అయినప్పటికీ కోత సమయంలో రావడంతో గొలుసులకు ఉన్న ధాన్యం రాలిపోతుందని రైతులు చెబుతున్నారు.
ఏరకుండా వదిలేస్తున్నా..
నాకున్న ఐదెకరాల్లో మామిడి తోట పెట్టిన. పూత మంచిగ వచ్చి, కాయలు కూడా బాగా కాశాయి. ఈ యేడాది కలిసొచ్చిందని అనుకున్నా. అప్పులు కూడా తీరుతాయని భావించా. బుధవారం కోద్దామని అనుకున్న ఇంతలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం పడింది. మామిడి కాయలన్నీ నేల రాలాయి. మార్కెట్కు తీసుకుపోతే ఎవరూ కొనరు. కొన్నా కిలోకు రూ.4 కూడా పెట్టరు. మాములుగా అయితే కిలోకు రూ.40 వచ్చేటివి. ఇప్పుడు ఏరకుండా వదిలేస్తున్నా. నా ఆశ నిరాశే అయ్యింది.
– బోయిని మొండి, మామిడి రైతు, గొల్లపల్లి గ్రామం.
వారంలో జొన్న చేతికొచ్చేది..
నాకున్న మూడెకరాల్లో జొన్న వేశా. రాష్ట్ర సర్కారు అందిస్తున్న రైతుబంధుతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి సకాలంలో పంట వేశా. సాగులో భాగంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా. దిగుబడి 15 క్వింటాళ్ల వరకు వచ్చే అవకాశం ఉండగా.. అకాల వర్షం మా ఆశలపై నీళ్లు చల్లింది. జొన్న పంట నేలరాలింది. రాళ్లు పడడంతో నష్టం బాగా జరిగింది. వారం రోజుల్లో కోతలు ప్రారంభించాలనుకున్నా. ఇలాంటి సమయంలో అకాల వర్షం వల్ల నష్టపోవాల్సి వచ్చింది
– సంపతి అజయ్, రైతు, దేవాపూర్, తలమడుగు మండలం
మూడు సార్లు కోత దశలోనే..
మూడు సార్లు మామిడి కాయలు చెట్టు మీద నుంచి కోద్దామనుకున్న సమయంలోనే ఈదురుగాలులు వచ్చాయి. మంగళవారం మార్కెట్ ఉండదని ఈ రోజు ఉదయాన్నే కాయ కోసేందుకు కూలీలను మాట్లాడుకున్నా. కానీ.. రాత్రి వచ్చిన గాలికి చేతికొచ్చిన కాయ రాలిపోయింది. అదే కూలీలు ఇప్పుడు రాలిన కాయను ఏరుతున్నారు. తొలిసారి వచ్చిన గాలికి మూడు నుంచి నాలుగు క్వింటాళ్లు, రెండో సారికి రెండు క్వింటాళ్ల మామిడి కాయలు రాలాయి. ఈ సారి ఒక టన్ను వరకు రాలింది. మళ్లీ కాయ కోద్దామనుకున్న సమయానికి గాలి వస్తే ఉన్న కాయలు కూడా పోతయ్. అదే జరిగితే ఈ సారి మిగిలేది గుండు సున్నానే.
– కొమ్ము గంగమల్లు, మామిడి రైతు, గొల్లపల్లి గ్రామం.
20 శాతం రాలిపోయాయి..
మా మూడెకరాల తోటలో గాలి వానకు 20 శాతం మామిడి కాయలు రాలిపోయాయి. కింద పడిన కాయలు కొన్ని పగిలాయి. ఇప్పటికే రెండు బస్తాల కాయలు తెలిసిన వారికి పంపించాం. ఇంకా ఐదు బస్తాల రాలిన కాయ ఉంది. వీటిని తెలిసిన వారికి ఇవ్వడం లేకపోతే పడేయడం తప్పా ఇంకేం చేయలేం. ఇప్పుటికైతే దాదాపు రూ.25 వేలు నష్టపోయాం.
– గంట అజయ్, మామిడి రైతు, నెన్నెల మండలం.
33 శాతం మామిడి పంట నష్టం
బెల్లంపల్లి డివిజన్ పరిధిలోని నెన్నెల, తాండూర్, బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, కాసిపేట, వేమనపల్లి మండలాల్లో పంట నష్టంపై పరిశీలన చేశాం. మూడు సార్లు వచ్చిన గాలులకు 33 శాతం మామిడి పంట నష్ట పోయినట్లు ప్రాథమిక అంచనా వేశాం. అన్ని మండలాల్లో పూర్తి స్థాయిలో పంటలు పరిశీలించి, నష్టంపై ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం. – సుప్రజ, ఏడీ, ఉద్యానవన శాఖ.