ఇంద్రవెల్లి, మే 9: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లో వేల ఏళ్ల చరిత్ర గల నాగోబా ఆలయాన్ని మెస్రం వంశీయులు అద్భుతంగా నిర్మించారు. ప్రత్యేక గ్రానైట్ రాయితో కళాత్మకంగా తీర్చిదిద్దారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ప్రత్యేక గ్రానైట్ రాయితో (బండరాళ్ల)తో ఆలయానికి కావాల్సిన స్తంభాలు తయా రు చేయించారు. వాటిపై పడియోరు(నాగోబా దేవత)కు సంబంధించిన వివిధ రకాల శిల్పాలు చెక్కించారు. వీటిని ఆలయంలో ఏర్పా టు చేశారు. దీంతో నూతనంగా నిర్మించిన నాగోబా ఆలయం శిల్పకళతో ఆకట్టుకుంటున్నది.
భావితరాలకు తెలిసేలా..
వేల ఏళ్లుగా మెస్రం వంశీయులు నాగోబా దేవతకు పుష్యమాసంలో మహాపూజలు నిర్వహిస్తుంటారు. 1956లో చిన్నగుడి నిర్మించి నాగోబా జాతర నిర్వహిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న గోడం నగేశ్ అప్పట్లో రూ. 3.80 లక్షలతో రెండోసారి నాగోబా ఆలయంతోపాటు గర్భగుడి, సతీదేవత గుడి, ఆలయ మండప నిర్మాణం చేపట్టారు.
ఆలయ చరిత్రను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో మెస్రం వంశీయుల కుటుంబ సభ్యుల నుంచి విరాళాలుగా సేకరించిన రూ. 4.67లక్షలతో నూతన నాగోబా ఆలయంతోపాటు సతీక్దేవత ఆలయ నిర్మాణం చేపట్టారు. నాగోబా ఆలయ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 6 కోట్లు మంజూరు చేసింది. వీటితో అధికారులు మినీస్టేడియంతోపాటు నాగోబా ఆలయంలో ప్రకార మండపం, చుట్టూ నాలుగు స్వాగత తోరణాలు, రాజ గోపురాలు, ధ్వజస్తంభం నిర్మాణం చేపట్టారు.