ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 3 : ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం కేస్లాపూర్ నాగోబాను దర్శించుకొనేందుకు ఆయా ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. గురువారం జిల్లాలోని నలుమూలలతోపాటు వివిధ రాష్ర్టాల భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి నాగోబాను దర్శించుకొని పూజలు చేశారు. వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయంతోపాటు జాతరలోని పరిసరాల కిక్కిరిశాయి. నాగోబా దర్శనం కోసం భక్తులు గంటల కొద్దీ బారులు తీరారు. దారిపొడవునా ఏర్పాటు చేసిన దుకాణాలు, హోటళ్లు కొనుగోళ్లతో సందడిగా మారాయి. గోవాడ్లో మెస్రం వంశీయుల మహిళల ఆధ్వర్యంలో సంప్రదాయ పూజలు కొనసాగుతున్నాయి. 22 పొయ్యిలపై సామూహిక వంటలు చేశారు. జొన్నగట్క లడ్డూలను పంచుకుంటున్నారు. నార్నూర్ మండలంలోని బాబేఝరికి చెందిన శ్రీగణేశ్ యూత్ ఆధ్వర్యంలో ఆదివాసీ గిరిజన కళాకారులు గోండి భాషలో ప్రదర్శించిన నాటకం ఆకట్టుకున్నది. కార్యక్రమంలో కళాకారులు ఉర్వేత మహాదేవ్, పెందూర్ జంగు, పుసం మధుకర్, ఫంద్ర యాదవ్, తొడసం సురేశ్, ఆర్ఎస్ సంతోష్, కుర్సెంగ నాగోరావ్, పుసం రాము పాల్గొన్నారు.
జాతరలో మెస్రం వంశీయుల సంస్కృతీ సంప్రదాయాలను కాపాడేందుకు ప్రజా దర్బార్ నిర్వహించామని మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్పటేల్ పేర్కొన్నారు. జాతరలో మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ను పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్పటేల్ నాగోబా ఫొటోకు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాగోబా జాతరలో ఏటా నిర్వహించే దర్బార్ను అధికారులు వాయిదా వేయడంతో మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. గిరిజనుల కోసం హైమన్డార్ఫ్ ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ని అధికారులు విస్మరించారని పేర్కొన్నారు. దర్బార్ ఆదివాసీ గిరిజన సంస్కృతీసంప్రదాయ నృత్యాలతో మార్మోగింది. ఆదివాసీ గిరిజన విద్యార్థులతోపాటు గుస్సాడీ నృత్యాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో సర్పంచ్ మెస్రం రేణుకానాగ్నాథ్, మెస్రం వంశీయులు చిన్నుపటేల్, బాధిరావ్పటేల్, కటోడ కోసురావ్, కటోడ హనుమంత్రావ్, కటోడ కోశరావ్, దుర్గు, జంగు, లింబారావ్, దేవ్రావ్, సోనేరావ్, నాగ్నాథ్, శేఖర్బాబు, తుకారాం, ఆనంద్రావ్, నాగోరావ్, షేకు పాల్గొన్నారు.