ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో తెలంగాణ సర్కారు సకల సౌకర్యాలు కల్పించి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నదని న్యాక్ బృందం పేర్కొన్నది. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలను సందర్శించి, మౌలిక సదుపాయాలు, సాధించిన ప్రగతి, ఫలితాలు తదితర అంశాలను పరిశీలించింది. దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ), ఈ ఆఫీస్(పేపర్ లెస్ ఆఫీస్) దేశంలోని మరే రాష్ట్రంలో లేదని, ఇక్కడ కోర్సుల నిర్వహణ బాగుందని, కాలేజీ అభివృద్ధికి పూర్వ విద్యార్థులు చేస్తున్న కృషి అభినందనీయమని ప్రశంసించింది. మంచి గ్రేడ్ తీసుకురావడానికి తమవంతు సహకారం ఉంటుందని హామీనిచ్చింది.
మంచిర్యాల, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నదని న్యాక్ బృందం ప్రశంసించింది. దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ), ఈ ఆఫీస్(పేపర్ లెస్ ఆఫీస్) దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలు చేయడం లేదని స్పష్టం చేసింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని డిగ్రీ కాళాశాలో న్యాక్ బృందం పర్యటించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పన, చేపట్టిన అభివృద్ధి పనులు, తరగతుల నిర్వహణ, సాధించిన ఫలితాలు తదితర అంశాలను పరిశీలించింది. ఈ సందర్భంగా కళాశాల విద్యలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో చేపట్టిన కార్యక్రమాలపై కళాశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేందర్సింగ్, ప్రిన్సిపాల్ డాక్టర్ వీ చక్రపాణి ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. దోస్త్ వెబ్సైట్, ఈ ఆఫీస్, కేమ్స్ (కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్), ప్రతి డిగ్రీ కళాశాలలో తెలంగాణ స్కిల్ అండ్ నాలెజ్డ్ సెంటర్ (టాస్క్) ఏర్పాటు, క్యాంపస్ ఇంటర్వ్యూలు, 56 సబ్జెక్టుల కాంబినేషన్లో డిగ్రీ కోర్సుల నిర్వహణ బాగుందని బృందం ప్రశంసించింది. పిల్లలకు నచ్చిన సబ్జెక్టు ఎంచుకునే అవకాశం కల్పించడంతో పాటు ఆన్లైన్ బోధనపై హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో రెండున్నర లక్షల అడ్మిషన్లు రావడం మామూలు విషయం కాదన్నారు. అనంతరం కళాశాలలో అన్ని డిపార్ట్మెంట్లు, లైబ్రరీ, ల్యాబ్లు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ కేంద్రాలను పరిశీలించారు. విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు.
గ్రామీణ వాతావరణంలో నాణ్యమైన విద్య..
గ్రామీణ వాతావరణంలో డిగ్రీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నారని న్యాక్ చైర్మన్ డాక్టర్ అశోక్ బోయటే అన్నారు. ఇక్కడ విద్యార్థులకు, కళాశాలకు మధ్య ఒక అనుబంధం ఏర్పడిందని పేర్కొన్నారు. కళాశాల అభివృద్ధికి పూర్వవిద్యార్థులు చేస్తున్న కృషిని అభినందించారు. బోధనా సిబ్బంది సంఖ్యను కొంత పెంచుకోవాలని సూచించారు. వెనుకబడిన ఆదివాసీ ప్రాంతం అని చాలా మంది తనతో చెప్పారని, కానీ మన దేశ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కూడా ఒక ఆదివాసీ అని గుర్తించాలన్నారు. నేర్చుకోవాలన్న తపన ఉంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నా అద్భుతాలు చేయవచ్చన్నారు. కళాశాలలకు మంచి గ్రేడ్ తీసుకురావడానికి తమవంతు సహకారం కచ్చితంగా ఉంటుందని హామీ ఇచ్చారు. మెంబర్ కో ఆర్డినేటర్లు డాక్టర్ రిచా చోప్రా, డాక్టర్ మీనాక్షి సుందర్రాజన్ మాట్లాడుతూ.. మంచి గ్రేడ్ రావడం అనేది తమ చేతుల్లో 30 శాతం మాత్రమే ఉందన్నారు. కళాశాల తమకు పంపిన ఎస్ఎస్ఆర్ రిపోర్టులోని విషయాలు సరిగా ఉన్నాయా.. లేదా..? అని చూసి నివేదించడమే తమ పని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కంటే గొప్ప గ్రేడ్ మరొకటి ఉండదని పేర్కొన్నారు. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా ఎదుర్కొనేలా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకొని జీవితంలో స్థిరపడే విజ్ఞానాన్ని కాలేజీలోనే అందించాలని సూచించారు. కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు కేవీ ప్రతాప్, జీపీవీ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గురువారంతో న్యాక్ బృందం పర్యటన ముగుస్తుందని ప్రిన్సిపాల్ డాక్టర్ వీ చక్రపాణి తెలిపారు.
ఎడ్యుకేషన్ హబ్గా మంచిర్యాల : ఎమ్మెల్యే దివాకర్రావు
ఉమ్మడి ఆదిలాబాద్లో మంచిర్యాల జిల్లా ఎడ్యుకేషన్ హబ్గా ఎదుగుతుందని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. కళాశాలలో న్యాక్ బృందంతో జరిగిన పూర్వ విద్యార్థుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పెద్దపల్లి, రామగుండం, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి వచ్చి ఎందరో విద్యార్థులు ఈ కళాశాలలో చదువుకుంటున్నారన్నారు. న్యాక్ బృందం సూచనల మేరకు మరో మూడు నెలల్లో డిగ్రీ విద్యార్థినుల కోసం హాస్టల్ను అందుబాటులోకి తెస్తామన్నారు. ఇప్పటికే బస్సు సదుపాయం కూడా అందుబాటులోకి తెచ్చామని, న్యాక్ కమిటీ ఎలాంటి సూచనలు చేసినా వాటిని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కళాశాలకు మంచి గ్రేడ్ కేటాయించి అధిక నిధుల మంజూరుకు సహకరించాలని కోరారు. కళాశాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి సహకారం కావాలన్న అందిస్తామని హామీ ఇచ్చారు.