రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుగురి సజీవదహనం కేసును పోలీసులు చాలెంజ్గా తీసుకున్నారు. నాలుగు రోజులుగా 16 బృందాలతో గాలింపు చేపట్టారు. సింగరేణి ఉద్యోగి శాంతయ్యసహా మాసు పద్మ, శివయ్య, మౌనిక, ఆమె ఇద్దరి పిల్లలవి హత్యలేనని నిగ్గు తేల్చారు. ఆస్తులన్నీ పద్మ కుటుంబానికి రాసిస్తాడని, సింగరేణి ఉద్యోగం తన కొడుకులను కాదని పద్మ కొడుక్కు ఇస్తాడనే అనుమానంతో సృజన తన ప్రియుడు లక్ష్మణ్తో కలిసి శాంతయ్యను అంతం చేయించింది. రెండుసార్లు యాక్సిడెంట్ చేసి చంపాలనుకొని విఫలం అయ్యారు. మూడోసారి కత్తులతో పొడిచి చంపాలనుకొని దొరికిపోతామనే భయంతో పథకం మార్చారు. చివరకు రాఖీ సినిమాలో హీరో పెట్రోల్ పోసి విలన్లను చంపినట్లు చేస్తే తాము సులభంగా తప్పించుకోవచ్చని భావించి పథకం వేశారు. పథకం ప్రకారమే శుక్రవారం అర్ధరాత్రి చంపేశారు. ఈ వివరాలను మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో మంగళవారం సీపీ చంద్రశేఖర్రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
మంచిర్యాల, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆరుగురి సజీవ దహనం కేసుకు సంబంధించి ఘటనా స్థలంలో దొరికిన సమాచారం, పోలీసు బృందాల ద్వారా వచ్చిన సమాచారం మేరకు నిందితులను పట్టుకున్నామని రామగుండంం సీపీ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి సరిల్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ కుమార్ సిబ్బందితో కలిసి కేసులో ప్రధాన నిందితులైన లక్ష్మణ్, రమేశ్, సమ్మయ్యను మంచిర్యాల ఓవర్ బ్రిడ్జ్ వద్ద పట్టుకున్నారు. నిందితులు చెప్పిన సమాచారం మేరకు సృజన, అంజయ్యను శ్రీరాంపూర్ ఎస్ఐ మానస శ్రీరాంపూర్లో అదుపులోకి తీసుకున్నారు.
సృజన ప్రియుడు, లక్షెట్టిపేటకు చెందిన మేడి లక్ష్మణ్ (42) డాక్యుమెంట్ రైటర్. గతంలో శాంతయ్య కుటుంబానికి సంబంధించిన భూములు కొలతలు గణించేందుకు రాగా, 2010 నుంచి వారి మధ్య పరిచయం పెరిగింది. శాంతయ్య భార్య సృజనకు లక్ష్మణ్ రెండు విడుతల్లో రూ.4 లక్షలు అప్పుగా ఇచ్చాడు. డబ్బులు అడిగే క్రమంలో సృజన, లక్ష్మణ్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అప్పటికే శాంతయ్యకు శ్రీరాంపూర్లోనే ఉండే మాసు రాజలక్ష్మి అలియాస్ పద్మతో పరిచయం ఉంది. ఈ విషయంలో శాంతయ్య, సృజన, ఆమె తల్లిదండ్రులు అర్నకొండ అంజయ్య, చంద్రమ్మకు తరచూ గొడవలు జరిగేవి. ఈ విషయంలో పలుమార్లు పంచాయితీలు కూడా జరిగాయి. అప్పటి నుంచి శాంతయ్య గుడిపెల్లిలోని పద్మ ఇంట్లోనే ఉంటూ అకడి నుంచే విధులకు వెళ్తున్నాడు. భార్య, పిల్లలను పట్టించుకోవడం మానేశాడు.
ఆరునెలల క్రితం లక్ష్మణ్తో ఒప్పందం . .
శాంతయ్యను చంపితేనే తన కష్టాలు తీరుతాయని భావించిన సృజన భర్తను హత్య చేయాలని లక్ష్మణ్కు చెప్పింది. అందుకు లక్షెట్టిపేటలో తన బిడ్డపేరు మీద ఉన్న పది గుంటల స్థలంలో మూడు గుంటలు రాసిస్తామని లక్ష్మణ్కు ఆరు నెలల క్రితం ఆశ చూపింది. దీనికి ఆమె తండ్రి అంజయ్య కూడా ఒప్పుకున్నాడు. శాంతయ్యకు సింగరేణి నుంచి వచ్చే డబ్బుల్లో కొంతమొత్తం మిగిలించుకోవచ్చనే దురాలోచనతో లక్ష్మణ్ కూడా ఇందుకు ఒప్పుకున్నాడు. ఈ సమయంలోనే శాంతయ్య గద్దెరాగడిలోని భూమిని సృజనకు తెలియకుండా విక్రయించాడు. దీంతో లక్ష్మణ్ ఓ అడ్వకేట్ ద్వారా శాంతయ్య అన్నదమ్ముల మీద భూమి విషయంలో ఓ కేసు, శాంతయ్యపై మెయింటేనెన్స్ కేసు (సింగరేణిలో ఎలాంటి లావాదేవీలు జరగకుండా) వేయించాడు.
విచారణలో లక్ష్మణ్ చెప్పింది ఇదే..
శాంతయ్యను తానొక్కడినే హత్య చేయలేనని లక్మణ్ సృజన, ఆమె తండ్రికి చెప్పాడు. శాంతయ్యను హత్య చేస్తే లక్షెట్టిపేటకు చెందిన శ్రీరాముల రమేశ్కు రూ.నాలుగు లక్షలు ఇస్తామని లక్ష్మణ్, సృజన ఒప్పందం చేసుకున్నారు. రూ.40వేలు అడ్వాన్స్ ఇచ్చారు. నెలలోనే ఈ పని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. శాంతయ్యను ఆక్సిడెంట్ చేసి చంపేందుకు లక్షెట్టిపేటకు చెందిన కొమాకుల మహేశ్ బొలెరోను రూ.1.40లక్షలకు కొనేందుకు ముందుగా రూ.43 వేలు అడ్వాన్స్ ఇచ్చారు. ఆ బండికి ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో బ్రోకర్ ద్వారా మరో రూ. 40 వేలు ఖర్చు చేసి పేపర్లు తయారు చేయించారు. శాంతయ్య ఆక్సిడెంట్లో చనిపోతే పేపర్స్ ఉంటే అన్నిరకాల బెనిఫిట్స్ అం దుతాయని కుట్ర పన్నారు. శాంతయ్య కదలికలికపై నిఘా పెట్టాలని గుడిపెల్లికి చెందిన శ్రీనును కలిశారు. తమ ప్లాన్ గురించి చెప్పి రూ.1.50 లక్షలు ఇస్తామని అతనితోనూ ఒప్పందం చేసుకున్నారు.
రెండు సార్లు మిస్..
సమ్మయ్య సమాచారంతో గుడిపెల్లి సమీపంలో కాపుకాసిన రమేశ్ మంచిర్యాల నుంచి ఆటోలో వస్తున్న శాంతయ్య, పద్మలను ఢీకొట్టేందుకు వెళ్లగా ఆర్కే-5 రోడ్డు మలుపు వద్ద బొలెరో అదుపుతప్పి బోల్తా పడింది. ఇది జరిగిన నాలుగు రోజులకు శాంతయ్య, మాసు పద్మను మంచిర్యాలలో మరోసారి బొలెరోతో ఢీకొట్టే ప్రయత్నం చేయగా త్రుటిలో తప్పించుకున్నారు. దీంతో లక్ష్మణ్, రమేశ్, సమ్మయ్య దాడిచేసి చంపాలని నిర్ణయించుకొని రామకృష్ణాపుర్ అంగడిలో కత్తులు కొన్నారు. దొరికిపోతామని భావించి ప్లాన్ మార్చారు. రాఖీ సినిమాలో మాదిరి పెట్రోల్ పోసి కాల్చి చంపుదామనుకున్నారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో సమ్మయ్య, రమేశ్కి ఫోన్ చేసి శాంతయ్య, పద్మ ఆమె భర్త శివయ్యతో పాటు గుడిపల్లిలోనే ఉన్నారని సమాచారం ఇచ్చారు. దీంతో లక్ష్మణ్, రమేశ్ మంచిర్యాలకు వచ్చి ఓ బార్ మద్యం తాగారు.అనంతరం రమేశ్ వెళ్లి పెద్ద ప్లాస్టిక్ క్యాన్, ఒక ఖాళీ రైస్ బ్యాగు, కారం పొడి, అగ్గిపెట్టెలు తీసుకొని వచ్చాడు. అనంతరం యాదగిరి అనే వ్యక్తికి ఫోన్ చేసి ఆటోలో క్యాన్లు తీసుకొని రావాలని సూచించారు. తాను అందుబాటులో లేనని యాదరిగి మరో ఆటో డ్రైవర్ శీపతి రాజుకు మూడు ఖాళీ క్యాన్లు ఇచ్చి పంపించాడు. అనంతరం లక్ష్మణ్, రమేశ్ ఆటోలో వెళ్లి రూ. 5 వేల పెట్రోల్ కొన్నారు. అనంతరం ముగ్గురు కలిసి మద్యం తాగారు. పెట్రోల్ను ఇంటిపై చల్లడానికి వీలుగా వాటర్ బాటిళ్లను సగానికి కట్ చేశారు. అనంతరం అక్కడి నుంచి గుడిపెల్లి వెళ్లారు. అక్కడ రమేశ్ను వదిలేసి లక్ష్మణ్ అదే ఆటోలో తిరిగి మంచిర్యాల వచ్చాడు. రాత్రి 12.30 గంటల సమయంలో పెట్రోల్ క్యాన్లతో సమ్మయ్య, రమేశ్ వెళ్లి పద్మ ఇంటికి నిప్పు పెట్టారు. సమ్మయ్య ఇచ్చిన సమాచారంతోనే దాడి చేశామని, మౌనిక ఆమె ఇద్దరి పిల్లలు కూడా అక్కడే ఉన్నారని తమకు తెలియదని, ముగ్గురే ఉన్నారనుకున్నామని లక్ష్మణ్ పోలీసుల విచారణలో తెలిపాడు.
నాలుగు నెలలుగా ఫోన్లు బంద్..
శాంతయ్యను హత్య చేసేందుకు యత్నిస్తున్న సమయంలో ఫోన్లో మాట్లాడితే దొరికిపోతామని భావించిన సృజన, లక్ష్మణ్ నాలుగు నెలలుగా ఫోన్లో మాట్లాడుకోవడం మానేశారు. ఏదైనా అవసరం ఉంటే నేరుగానే చర్చించుకునేవారు. కానీ ఆగస్టు కంటే ముందు వారు నిత్యం ఫోన్లు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. రమేశ్పై గతంలో ల్యాండ్ చీటింగ్ కేసు, ట్రాక్టర్తో ఓ వ్యక్తిని చంపిన కేసు, సృజనపై భర్తతో గొడవ పడిన కేసు, అంజయ్యపై ఓ గొడవ కేసు ఉన్నాయి సమ్మయ్యపై ఎలాంటి కేసులు లేవని పోలీసులు తెలిపారు. నిందితులకు త్వరగా శిక్షపడేలా చూస్తామని, బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతామని సీపీ తెలిపారు. సమావేశంలో ఇన్చార్జి డీసీపీ అఖిల్మహాజన్, బెల్లంపల్లి ఏసీపీ మహేశ్, మందమర్రి సీఐ ప్రమోద్కుమార్ పాల్గొన్నారు.