ఇచ్చోడ, ఏప్రిల్ 15 : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) గ్రామం జాతీయస్థాయిలో నంబర్వన్గా నిలిచినందని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జాతీయస్థాయి అవార్డులకు ఎంపికైన గ్రామాల సర్పంచులు ఢిల్లీకి వెళ్తున్న సందర్భంగా శనివారం హైదరాబాద్లోని రాజేంద్ర నగర్ టీఎస్ఐఆర్డీ భవన్ నుంచి విమానశ్రయానికి వెళ్తున్న బస్సు వద్ద జెండా ఊపి పంపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పల్లె ప్రగతితో తెలంగాణ పల్లెల రూపురేఖలు మారాయని అన్నారు.
కేంద్రం ప్రకటించే ప్రతి అవార్డులో ముక్రా(కే)కు అవార్డు వస్తున్నదని, ముక్రా(కే) గ్రామంలో ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుందన్నారు. ప్రతి జాతీయస్థాయి అవార్డుల్లో ముక్రా(కే) ఉండడం తెలంగాణకు గర్వకారణమని చెప్పారు. దేశంలోని ప్రతి పల్లె ముక్రా(కే) లా ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం ముక్రా(కే) సర్పంచ్ గాడ్గె మీనాక్షిని అభినందించారు. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రణాళిక సంఘం బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ డైరెక్టర్ హన్మంత్రావు, డీపీవో శ్రీనివాస్, ఎంపీటీసీ గాడ్గె సుభాష్ పాల్గొన్నారు.