Summer Fruits | నెన్నెల, మే 12: అడవిలో లభించే పండ్లు కనబడితే చాలు నోరూరక తప్పదు. వేసవిలో మాత్రమే లభించే పాల పండ్లు, మొర్రి పండ్లు, జీడి మామిడి, తునికి పండ్లు చాల రుచిగా ఉంటాయి. వేసవిలో గిరిజనులు వీటితో ఉపాధి పొందుతుంటారు. పాల పండ్ల భలే డిమాండ్ ఉంది. ఇవి దొరికేవి మాత్రం రెండు మూడు వారాలు మాత్రమే. కాని వాటి కోసం కూలీలు రాత్రీపగలు అడవికి వెళ్లి చెట్టు చెట్టుకూ తిరిగి కొసుకుని రావాలి. వంద గ్రాముల పాల పండ్లకు రూ. 20 నుంచి రూ. 30 ధర పలుకు తున్నాయి. ఇక మొర్రి పండ్లు కూడా వారం రెండు వారాలే లభ్యమవుతాయి.
ఈ మొర్రిపండ్లతో పాటు లోపల సార పలుకులు తీసి అమ్ముతారు. ఇవి చాల ఖరీదైనవి. జీడి మామిడి కూడా 20 రోజుల పాటు ఉంటాయి. తునికి పండ్లు మాత్రం ఏడాదిలో రెండు మూడు సార్లు కాతకు వస్తుంటాయి. వీటిని అడవి నుంచి తీసుకు వచ్చి మాగ బెట్టి సంతల్లో విక్రయిస్తుంటారు. వేసవిలో లభించే లోకల్ ఖర్జురాల ఉండే ఈత పండ్లు చాలా రుచిగా ఉంటాయి. ఈ వేసవిలో మాత్రం ఏపండ్లు దొరికిన తినక తప్పదు. చాలా మంది ఎక్కడ ఉన్నా పండ్ల కోసం పరితపిస్తుంటారు. వేసవిలో లభించే పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పెద్దలు అంటున్నారు. ఈ పండ్లలో ఆరోగ్యానికి కావాల్సిన విటమిన్లు పుష్కలంగా దొరుకుతాయి.