కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రం ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ సుంకరి రాజు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలకు జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్రావు, అదనపు కలెక్టర్లు చాహత్బాజ్పాయ్, రాజేశం, ఎస్పీ సురేశ్కుమార్తో కలిసి హాజరయ్యారు. ఎమ్మెల్సీ సుంకరి రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ అత్యంత ప్రగతి శీల రాష్ట్రంగా రూపుదిద్దు కుందన్నారు. తెలంగాణ ఆచరిస్తుంది- దేశం అనుసరిస్తుంది అనే స్థాయికి ఎదగడం గర్వకారణమన్నారు. నిర్మాణాత్మకమైన ఆలోచనలు, మానవీయమైన దృక్పథం, పారదర్శకమైన పాలనతో అద్భుతమైన ప్రగతి సాధ్యమైందన్నారు. తెలంగాణ సాధించిన ప్రగతిపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రసంశలు వస్తున్నాయని, తెలంగాణ మోడల్ నేడు జాతీయస్థాయిలో మన్ననలు పొందుతుందన్నారు.
ఆర్థిక మాంద్యం, కరోనావంటి సంక్షోభాలు ఎదురైనప్పటికీ తట్టుకొని బలమైన ఆర్థిక శక్తిగా నిలబడగలిగిందని, సంక్షోభ సమయాల్లోనూ సంక్షేమ పథకాలను అమలు చేయడం బీఆర్ఎస్ సర్కారుకే సాధ్యమైందన్నారు. రైతు బీమా, రైతు బంధు, ఉచిత విద్యుత్ వంటి పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా లేవన్నారు. పట్టణం నుంచి పల్లెదాకా అన్ని రకాల వైద్య సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందని, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు మెడికల్ కళాశాల అందుబాటులోకి తీసుకురావడం కేసీఆర్ గొప్పతనమన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా వంటి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, మిషన్ భగీరథతో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, సాంస్కృతిక కళాకారులు నిర్వహించిన ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనకయాదవరావు, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు పాల్గొన్నారు.