ముథోల్, ఏప్రిల్ 10 : మన పథకాలతో లబ్ధిపొందుతూ భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీని ప్రతిపక్షాలు బద్నాం చేసే కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నాయని ముథోల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు విఠల్రెడ్డి మండిపడ్డారు. సోమవారం నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలోని డీలక్స్ ఫంక్షన్హాల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. డ్వాక్రా మహిళలకు రాష్ట్ర సర్కారు వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తున్నదని తెలిపారు.
మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్లో చేరడానికి చాలా మంది వస్తున్నట్లు వివరించారు. రాముడు, హనుమాన్ దేవుళ్లను అందరూ పూజిస్తారని, అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే అని స్పష్టం చేశారు. కాగా.. ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన విశ్వంబర్తోపాటు 50 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే విఠల్రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు జయశంకర్, భరతమాత చిత్రపటాల వద్ద ఎమ్మెల్యే పూజలు చేసి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అప్రొజ్ ఖాన్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సురేందర్రెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు రాంరెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు మగ్దుమ్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్ గౌడ్, మాజీ ఎంపీటీసీ పోతన్న యాదవ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సంతోష్, నాయకులు శ్రీనివాస్ గౌడ్, సమీ పాల్గొన్నారు.
పండుగొచ్చినట్టుంది..
ఆత్మీయ సమ్మేళనం ఒక పండగలా కనిపించింది. నూతన ఉత్సాహం నింపింది. సమ్మేళనానికి ఆటోలో తరలివచ్చాం. నాయకులు ఆప్యాయంగా పలకరించడంతోపాటు మంచి, చెడు తెలుసుకున్నారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించడంలో ఎమ్మెల్యే ముందుంటున్నారు.
– గంగాధర్, ఆష్టా, ముథోల్.
మళ్లీ కేసీఆర్నే సీఎంను చేద్దాం
వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను గెలిపించుకొని మళ్లీ సీఎంను చేద్దాం. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అందరికీ న్యాయం జరుగుతున్నది. పేదింటి ఆడబిడ్డలకు కేసీఆర్ ఇచ్చే షాదీముబారక్ బాగుంది. ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటాం.
– మగ్బుల్, ముథోల్.