ఆసిఫాబాద్, మార్చి 7 : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఉచితంగా ప్లాట్లను క్రమబద్ధీకరించాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్లో రుసుములు విధించకుండా.. పూర్తి ఉచితంగా అమలయ్యేలా చూడాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆమె ఎమ్మెల్యే మాట్లాడుతూ గత కేసీఆర్ సర్కారు 2022 నుంచి ఎల్ఆర్ఎస్ అమలు చేసేందుకు జీవోఎంఎస్ 135ను విడుదల చేసిందని గుర్తు చేశారు. దీని ప్రకారం భూ వైశాల్యానికి అనుగుణంగా స్లాబులు నిర్ణయించి ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో ఉన్న పేదలకు అందుబాటు ధరల్లో ప్లాట్లను క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించిందన్నారు.
కాంగ్రెస్ అధికారంలో వస్తే ఎల్ఆర్ఎస్లో విధించిన రుసుములు మొత్తం రద్దు చేస్తామని, ఉచితంగా పట్టాలు ఇస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించి.. ఇప్పుడు మాట మార్చడం సరికాదని మండిపడ్డారు. సామాన్యులకు నష్టం కలిగించే జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్హైమద్, ఆసిఫాబాద్, జైనూర్ మండలాల అధ్యక్షులు గంధం శ్రీనివాస్, ఇంతియాజ్లాలా, నాయకులు బుర్స పోచ్చయ్య, సాంగ్డె జీవన్, భీమేశ్, నిసార్, అశోక్ ఉన్నారు.
నస్పూర్, మార్చి 7 : కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దివాకర్రావు, చిన్నయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ బదావత్ సంతోష్ను కలిసి వినతి పత్రం అందించారు. వారు మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయకుండా ప్రజలపై ఆర్థిక భారం మోపాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని, ఇది సరైంది కాదన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.