శంషాబాద్ రూరల్, జూలై 30: విమానాల రాకపోకలకు ఇబ్బందులు కల్గిస్తే చర్యలు తప్పవని హైదరాబాద్ అదనపు కమిషనర్ తఫ్సిర్ ఇక్బాల్ ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులను హెచ్చరించారు. గురువారం శంషాబాద్ ఎయిర్పోర్టులో చుట్టూ ఉన్న ఫంక్షన్హాల్స్, ఫాంహౌజ్లకు చెందిన యజమానులకు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ తఫ్సిర్ ఇక్బాల్ మాట్లాడుతూ శంషాబాద్ విమానాశ్రయం చుట్టూ లేజర్బీమ్ లైట్లు, స్కైబీమ్ లైట్లు, సెర్చ్ లైట్లు, మూవింగ్ బీమ్ లైట్లు ఇతర తీవ్రత గల కాంతి పరికరాల వినియోగాన్ని నిషేధించాలని సూచించారు.
లేజర్ లైట్లతో విమానాలకు టేకాఫ్, అప్రోచ్, ల్యాండింగ్ ప్రక్రియలకు అంతరాయం కలుగుతుందని వివరించారు. ఈ సమావేశంలో శంషాబాద్ జోన్ డీసీపీ రాజేష్, అదనపు కమిషనర్ ప్రదీప్రెడ్డి, జీఎంఆర్ చీఫ్ ఆపరేటింగ్ అధికారులతో పాటు భద్రత అధికారులు,ఫంక్షన్హాళ్ల నిర్వాహకులు పాల్గొన్నారు.