హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ‘మీకు ఉద్యోగావకాశాలు ఇప్పించిందే కాంగ్రెస్. మీ సమస్యల పట్ల, ప్రత్యేకించి మా ఆడబిడ్డలు సమస్యల పట్ల మాకు సంపూర్ణ అవగాహన ఉన్నది. మీవి పరిష్కరించలేనంత జటిలమైన సమస్యలేమీ కావు. ప్రభుత్వం అనుకుంటే ఒక గంటలో మీ సమస్యలు పరిష్కారమవుతాయి. మిమ్మల్ని సచివాలయంలో కూర్చోబెట్టి మీరు చాయ్ తాగే లోపల జీవో ఇవ్వవచ్చు. మేం అధికారంలోకి రాగానే మమ్మల్ని, మీ సంఘాల నాయకులను సచివాలయానికి పిలిపిస్తాం. ప్రజా దర్బార్ నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తాం. మిమ్మల్ని ఆదుకునే బాధ్యతను మేం తీసుకుంటాం. సమగ్రశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ఉద్యోగులకు ఉద్యోగభద్రత కల్పిస్తాం.
మా ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి నెలలోనే మీ సంఘాలను సచివాలయానికి పిలిచి సగౌరవంగా మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం’ అంటూ అధికారంలోకి రాకముందు 2023 సెప్టెంబర్ 13న హనుమకొండ ఏకశిలాపార్క్లో సమగ్ర శిక్ష ఉద్యోగుల ధర్నాకు సంఘీభావం ప్రకటిస్తూ రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ ఇది. ఆ తర్వాత 2 నెలలకే రాష్ట్రంలో కా్రంగెస్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. ఆపై మొదటి నెలతోపాటు మొదటి ఏడాది, రెండో ఏడాది కూడా పూర్తయ్యింది. తాజాగా ఆదివారం మూడో ఏడాది సైతం ముగిసింది. కానీ, ఎస్ఎస్ఏ ఉద్యోగులను సచివాలయానికి పిలిచిందీ లేదు. వారి సమస్యలను పరిష్కరించించిందీ లేదు. దీంతో రాష్ట్రంలోని సమగ్ర శిక్ష ఉద్యోగుల్లో అసంతృప్తి రాజుకుంటున్నది. రేవంత్రెడ్డి సర్కార్ వెయ్యిరోజుల పాలన పూర్తికావడంతో మూడేండ్ల క్రితం తమకు ఇచ్చిన హామీల సంగతేందని వారు ప్రశ్నిస్తున్నారు.
మళ్లీ సమ్మెకు సమాయత్తం
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేండ్లు గడిచినా తమ సమస్యలు పరిష్కారం కాకపోవడం, ఉద్యోగ భద్రత కల్పించకపోవడంతో ఎస్ఎస్ఏ ఉద్యోగులు మళ్లీ పోరుబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. తమకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ఉద్యోగాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఈ నెలాఖరున లేదా నవంబర్లో నిరవధిక సమ్మెకు దిగాలని యోచిస్తున్నారు. ప్రభుత్వాన్ని తాము కొత్తగా ఏమీ అడగటం లేదని, గతంలో రేవంత్రెడ్డి తమకు ఇచ్చిన హామీలనే నెరవేర్చాలంటున్నామని, చాయ్ తాగేలోపు సమస్యలు పరిష్కరిస్తామన్న మాటలను నిలబెట్టుకోవాలని మాత్రమే కోరుతున్నామని ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు యాదగిరి స్పష్టం చేశారు.
ఉద్యోగ భద్రత ఏదీ?
సమగ్రశిక్ష ప్రాజెక్ట్లో 19,300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా కాంట్రాక్ట్ ఉద్యోగులే. రెండు దశాబ్దాలుగా వీరికి ఉద్యోగ భద్రత లేదు. ఏటా అధికారులు వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తుండటం, మళ్లీ నియమిస్తుండటంతో తమ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొన్నదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తకువ వేతనాలతో పనిచేస్తున్న తమకు బేసిక్పే అమలు చేయడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామన్న హామీ ఇంతవరకు అమలు కాలేదని వాపోతున్నారు.
సమ్మె చేసినా ఫలితం శూన్యం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎస్ఎస్ఏ ఉద్యోగులు పలుమార్లు ప్రభుత్వ పెద్దలను, విద్యాశాఖ అధికారులను కలిసి, తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రాలు సమర్పించారు. అయినా సర్కార్ స్పందించలేదు. సమ్మె నోటీసు ఇచ్చినా సర్కార్లో కదలికలేకపోవడంతో ఉద్యోగులు 2024 డిసెంబర్, 2025 జనవరిలో 29 రోజులపాటు సమ్మెకు దిగారు. దీంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ వారితో చర్చించి, సమ్మె వివరణ ఒప్పందం చేసుకున్నారు. సమ్మె కాలానికి వేతనాలు చెల్లిస్తామని అంగీకరించారు. ఆ హామీ కూడా ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఆ తర్వాత ప్రభుత్వం ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమస్యల పరిష్కార బాధ్యతలను క్యాబినెట్ సబ్కమిటీకి అప్పగించింది. మూడు నెలల్లో సమస్యలను పరిష్కరిస్తామని చెప్పింది. ఆ సబ్కమిటీని అడిగితే.. విద్యాశాఖను సీఎం రేవంత్రెడ్డి పర్యవేక్షిస్తున్నారని, ఆయనతో చెప్పి సమస్యలు పరిష్కరిస్తామంటూ దాటవేస్తున్నారని ఉద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్థికేతర సమస్యలూ పెండింగ్లోనే
కనీసం ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలను కూడా కాంగ్రెస్ సర్కార్ పరిష్కరించడం లేదు. ఏటా వారిని తొలగించకుండా నిరంతరం కొనసాగించాలని, టీచర్ సహా ఇతర ఉద్యోగ నియామకాల్లో వారికి వెయిటేజీ ఇవ్వాలని, కేజీబీవీ ఉద్యోగుల తరహాలో సమగ్రశిక్ష పరిధిలోని ఇతర ఉద్యోగులకు ప్రసూతి సెలవులు ఇవ్వాలన్న డిమాండ్లు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి. దీనిపై ఎస్ఎస్ఏ ఉద్యోగులు మండిపడుతున్నారు. ‘ఎన్నికలకు ముందు మమ్మల్ని సచివాలయానికి పిలిచి సమస్యలు పరిషరిస్తామన్న మాట ఏమైంది? ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే మా సమస్యలు పరిషరిస్తామ హామీని అమలు చేయరా? అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.