జమ్ము, సెప్టెంబర్ 19: ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించే దీపారాధన కార్యక్రమానికి గైర్హాజరైన విద్యార్థులను ఐఐఎం జమ్ము శిక్షిస్తున్నదని కాంగ్రెస్కు చెందిన రాజ్యసభ ఎంపీ సయ్యద్ నాసీర్ హుస్సేన్ ఆరోపించారు. ఈ కార్యక్రమానికి హాజరుకాని విద్యార్థులు రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని, లేదా రూ.500 జరిమానా చెల్లించాలని ఐఐఎం జమ్ము విద్యార్థి కౌన్సిల్ నోటీసులు ఇచ్చిందని చెప్పారు. దీనికి శుక్రవారం డెడ్లైన్ విధిస్తూ జారీ చేసిన నోటీస్ను ఆయన సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు.
అసలు ప్రధాని పుట్టిన రోజు వేడుకకు విద్యార్థులు తప్పనిసరిగా ఎందుకు హాజరుకావాలని ఆయన ఎక్స్లో ప్రశ్నించారు. ‘ఇది ఐఐఎంలో ఏర్పాటు చేసిన ఒక విద్యాపరమైన బాధ్యతా? లేదా మోదీ ప్రచారాన్ని క్యాంపస్లో నిర్వహించడం తప్పనిసరి కార్యక్రమమా? విద్యా సంస్థల్లోని విద్యార్థుల్లో స్వతంత్ర భావాలను పెంపొందించాలే తప్ప వారిని రాజకీయ కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించడం, లేకపోతే జరిమానాలు విధిస్తామని బెదిరించడం తగదు.
బీజేపీ ప్రచార విన్యాసాలను మన అత్యున్నత విద్యాసంస్థలకు దూరంగా ఉంచాలి’ అని ఆయన అన్నారు. కాగా దీనిపై ఐఐఎం జమ్ము స్టూడెంట్ అఫైర్స్ చైర్పర్సన్ బ్రిగేడ్ నీరజ్ సోని వివరణ ఇస్తూ కార్యక్రమానికి హాజరుకాని ఏ విద్యార్థికి కూడా జరిమానా విధించ లేదని తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుక మాదిరిగానే ఇది కూడా సాధారణంగా తీసుకునే చర్యేనని పేర్కొన్నారు.