న్యూఢిల్లీ: ఢిల్లీలో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా ఎన్నికల సంఘం అధికారులు మాజీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, అతని కుటుంబ సభ్యులు నలుగురికి నోటీసులు జారీ చేశారు. న్యూఢిల్లీ-40 అసెంబ్లీ నియోజకవర్గ ఓటరైన కేజ్రీవాల్, అతని భార్య, కుమారుడు, తల్లిదండ్రులకు నోటీసులు జారీ చేయడం పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ విస్మయం వ్యక్తం చేసింది.
‘ఈ దేశంలో జరుగుతున్నదంతా పరమేశ్వరుడిని సంతోషపెట్టడానికేనా? మూడుసార్లు ఢిల్లీకి సీఎంగా పనిచేసిన కేజ్రీవాల్తో పాటు, అతని కుటుంబ సభ్యుల ఓట్లు గల్లంతు కావడం ఎలా సాధ్యం’ అని పేర్కొన్నది. కాగా, ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు సైతం నోటీసులు జారీ చేసినట్టు ఈసీ తెలిపింది. ఓటరు జాబితాలో ఆమె పేరులో తేడా కన్పించడంతో నోటీసులు పంపినట్టు తెలిపింది. ఈ ఏడాది జూన్లో ప్రారంభమైన సర్ ప్రక్రియ తర్వాత 1.45 కోట్లు ఉండే ఢిల్లీ ఓటర్లను 97.5 లక్షలకు తగ్గిస్తూ ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. తొలగింపునకు గురైన వారు ఈనెల 30 లోగా తమ అభ్యంతరాలు తెలుపుతూ దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొనగా, స్వల్ప సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు.