న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: అక్టోబర్ 1 నుంచి రాయితీతో కూడిన ఎల్పీజీ సిలిండర్ బుక్ చేసుకోవాలంటే గృహ వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణను పూర్తి చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం శనివారం తెలిపింది. ఇప్పటికే ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేసుకున్న వినియోగదారులు ఇకపై ఎటువంటి చర్యలూ చేపట్టాల్సిన అవసరం లేదు. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం సెప్టెంబర్ 19 నాటికి మొత్తం దేశీయ ఎల్పీజీ వినియోదారులలో 89.9 శాతం మంది, అంటే 27.43 కోట్ల మంది తమ బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణను పూర్తి చేసుకున్నారు.
ఈ ప్రక్రియను ఇంకా పూర్తి చేయని వారికి ధ్రువీకరణ పూర్త్తయన తర్వాత రాయితీతో కూడిన రీఫిల్ బుకింగ్ సదుపాయం కల్పిస్తామని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రాయితీతో కూడిన గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య పారిశ్రామిక అవసరాలకు మళ్లించడాన్ని నివారించడం, నకిలీ, అనైర్హమైన కనెక్షన్లను తొలగించడం ఈ చర్య వెనుక ఉన్న లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. వినియోగదారులు ఎల్పీజీ సరఫరా సమయంలో తమ డిస్ట్రిబ్యూటర్ షోరూమ్లో లేదా ప్రభుత్వ రంగంలోని మూడు చమురు మార్కెటింగ్ కంపెనీల మొబైల్ అప్లికేషన్ల ద్వారా అంటే ఇండేన్ కోసం ఇండియన్ ఆయిల్ ఒన్, భారత్గ్యాస్ కోసం హెల్లోబీపీసీఎల్, హెచ్పీ గ్యాస్ కోసం హెచ్పీ పే ద్వారా ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది.
బయోమెట్రిక్ ధృవీకరణను పూర్తి చేయడానికి ఇష్టపడని లేదా పూర్తి చేయలేని వారు కూడా ఎల్పీజీని పొందగలరు. అయితే వారికి సబ్సిడీ లేకుండా వర్తించే మార్కెట్ ధరకే అది లభిస్తుంది. అటువంటి వినియోగదారులు వెబ్సైట్లు, మొబైల్ యాప్లు, వాట్సాప్ చాట్బాట్లు, ఐవీఆర్ఎస్ వంటి ఓఎంసీల డిజిటల్ మాధ్యమాల ద్వారా తమ ఎంపికను నమోదు చేసుకోవలసి ఉంటుంది. స్థానిక లభ్యతను బట్టి వారు 5 కిలోల లేదా 10 కిలోల సిలిండర్లను పొందవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొన్నది.