ఆదిలాబాద్ టౌన్, మార్చి 17 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ పార్టీ నాయకులపై ఈడీ లాంటి సంస్థలను ఉసిగొల్పుతుందని, అయినా భయపడేది లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మావల మండల కేంద్రంలో మసీద్ వద్ద రూ.20 లక్షలతో చేపడుతున్న కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్తో పాటు మరో 10 లక్షలతో నిర్మిస్తున్న ఖబ్రస్థాన్ ప్రహరీ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నదని అన్నారు. ముస్లిం మైనార్టీల మసీదుల అభివృద్ధి, ఇతర పనులకు రూ.17 కోట్లతో పనులు చేపడుతున్నామన్నారు.
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జడ్పీటీసీ నల్ల వనిత, మైనార్టీ కమిషన్ సభ్యుడు అత్తరుల్లా, సర్పంచ్ ప్రమీల, ఏవన్, మున్సిపల్ వైస్చైర్మన్ జహీర్ రంజానీ, సాజిదొద్దీన్, నల్ల రాజేశ్వర్, గంగుల కిరణ్, మహేందర్, అజీమ్, హబీబ్, ఉమాకాంత్రెడ్డి, విజయ్, సుధీర్, భీమన్న, గంగయ్య, అభిమాన్, ప్రదీప్, సృజన్, నారాయణ, రాజన్న, సంతోష్ పాల్గొన్నారు.
అన్ని కులాలు, మతాలకు సమ ప్రాధాన్యం
ఎదులాపురం, మార్చి 17 : రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలు, మతాలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని సుభాష్నగర్, రాంనగర్, కేఆర్కే, మక్కా మసీద్, భుక్తాపూర్ , మహ్మదీయ, వడ్డెర కాలనీలోని ఉస్మానియా మసీదుల అభివృద్ధి కోసం రూ.17 కోట్లతో చేపడుతున్న పనులకు శుక్రవారం భూమిపూజ చేశారు. ముందుగా స్థానికులతో కలిసి మాట్లాడి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అండదండాతో కోట్ల రూపాయలు దందా చేస్తున్నటువంటి ఆదాని అంబానీలు కోట్ల రూపాయలకు టోకరా పెట్టిన బీజేపీ ప్రభుత్వం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు మాత్రం బీజేపీ ప్రభుత్వం ఈడీ సీఐడీ కేసులు అంటూ కేసీఆర్ కుటుంబంపై ఒత్తిడి పెంచడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరుతున్నాయని గుర్తు చేశారు. ప్రజా సంక్షేమంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆక్షేపించారు. కేవలం కార్పొరేట్లకు, దేశ సంపదను దోచుకునే వారికే కేంద్రం మద్దతు ఇస్తున్నదని మండిపడ్డారు. రాజకీయ కారణాలతో ఎమ్మెల్సీ కవితపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కవితకు తెలంగాణ ప్రజలు అండగా ఉంటారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, నాయకులు సాజిదొద్దీన్, యూనిస్ అక్బానీ, పట్టణ మైనార్టీ నాయకులు సలీం, జహూర్, ఎజాజ్ పాల్గొన్నారు.