ఎదులాపురం, మే8: వర్షాకాలంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టడం కష్టతరమవుతుందని, ప్రజలకు కొత్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. వర్షాకాలం పూర్తయిన తర్వాత అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభిస్తే ఇక్కట్లు ఉండవని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. తాంసి బస్టాండ్ వద్ద అండర్ బ్రిడ్జి నిర్మాణ స్థలాన్ని ఆయా శాఖల అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. పనుల విషయమై సుదీర్ఘంగా చర్చించారు.సుందరయ్యనగర్ సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం నిరాటంకంగా కొనసాగుతున్నది. అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపడితే వర్షాకాలంలో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందన్నారు.
వానలు తగ్గుముఖం పట్టిన తర్వాతే పనులు ప్రారంభిస్తే బాగుంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు. అనంతరం మున్సిపల్, ఆర్అండ్బీ, మిషన్ భగీరథ, విద్యుత్, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో విస్తృతంగా చర్చించారు. ఆయా శాఖల పరిధిలో చేపట్టిన పనుల వివరాలపై ఆరా తీశారు. వివిధ శాఖల సమన్వయంతో రైల్వే వంతెనల నిర్మాణ పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. అండర్ బ్రిడ్జి నిర్మాణ పనుల వివరాలను నాందెడ్ డివిజన్ రైల్వే డిప్యూటీ సీఈ శివరాం వెల్లడించారు. సం బంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో పనులపై విస్తృతంగా చర్చించారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ , ఆర్డీవో రమేశ్ రాథోడ్, ఆర్డబ్ల్ల్యూఎస్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బీ ఈఈ సురేశ్ రాథోడ్, వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, మున్సిపల్ కమిషనర్ శైలజ, వివిధ శాఖ అధికారులు, కౌన్సిలర్లు ఉన్నారు.
ఆదిలాబాద్ రూరల్, మే 8 : పట్టణంలోని సాయినగర్ రేణుకా ఎల్లమ్మ ఆలయ వార్షికోత్స వాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమ వారం అమ్మవారి కల్యాణోత్సవాన్ని ఘనంగా జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఎమ్మెల్యే జోగు రామన్న ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ బాధ్యులు ఎమ్మెల్యేకు అమ్మవారి చిత్రపటం అందజేశారు. కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు రంగినేని శ్రీనివాస్, గోలి శంకర్ పాల్గొన్నారు.