ఎదులాపురం, జూలై 14 : ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా అందించే వృత్తి నైపుణ్య శిక్షణలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక ప్రగతి సాధించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మహిళలకు సూచించారు. ఆదిలాబాద్లోని భాగ్యనగర్లో గల న్యాక్ కేంద్రంలో శుక్రవారం మూడు నెలల శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాక్ ద్వారా16 రకాల వృత్తి నైపుణ్య శిక్షణలు అందిస్తున్నారని తెలిపారు. కుట్టుమిషన్ వంటి శిక్షణలే కాకుండా సాంకేతికంగా సైతం రాణించాలన్నారు.
స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోడానికి ఇలాంటి శిక్షణలు ఎంతగానో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. మహిళల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండడానికి ఆసక్తి కలిగిన అంశాల్లో శిక్షణ పొందాలన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ వైస్చైర్మన్ జహీర్ రంజానీ, అసిస్టెంట్ లెబర్ ఆఫీసర్ రాజలింగు, కౌన్సిలర్ అశోక్స్వామి, నాయకులు మిషు, సంజయ్, న్యాక్ నిర్వాహకులు మేరి, డీ రమేశ్, తదితరులు పాల్గొన్నారు.