లక్షెట్టిపేట రూరల్, జూలై 18 : బీఆర్ఎస్ సర్కారుతోనే రైతుల ప్రగతి సాధ్యమని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు పేర్కొన్నారు. లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట రైతు వేదికలో మంగళవారం రైతులతో నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు బాగుపడుతుంటే చూసి ఓర్వలేకే టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి దిగజారిపోయి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. 1976లో రైతుల బోరుబావులకు కరెంట్ మీటర్లు పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, అప్పట్లో ఒకో రైతుకు రూ.వందల్లో కరెంట్ బిల్లులు వచ్చిన విషయం రేవంత్రెడ్డిని తెలుసుకోవాలని సూచించారు.
60 ఏండ్ల పాలనలో కాంగ్రెస్ రైతులకు చేసిందేమీ లేదన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో రైతులు పండుగలా వ్యవసాయం చేసుకొని ఆనందంగా జీవిస్తున్నారన్నారు. రైతుబంధుతో పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని కొనియాడారు. 24 గంటల ఉచిత విద్యుత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్రెడ్డి వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంకతి రాజేశ్వరి, కొత్తూరు సర్పంచ్ సొల్లు సురేశ్, ఉపసర్పంచ్ మోటపలుకుల శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు అంకతి గంగాధర్, ఎంపీటీసీలు బత్తుల సత్తయ్య, టేకుమెట్ల తార, నాయకులు, రైతులు పాల్గొన్నారు.