గుడిహత్నూర్, జూలై 18 : సాగుకు మూడు గంటలే కరెంటు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను కడిగేయాలని, పల్లెల్లోకి వస్తే నిలదీయాలని బోథ్ ఎమ్మెల్యే బాపురావ్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు సభ నిర్వహించగా పాల్గొని మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. వీటిని జీర్ణించుకోలేక టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కరెంటుపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు.
గత పాలకుల నిర్లక్ష్యంతో కరెంటు సరిగ్గా లేక పంటలు పండక, అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. అనంతరం మూడు పంటలు పండిస్తున్న రైతులను ఎమ్మెల్యే శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధికార ప్రతినిధి మొట్టే కిరణ్కుమార్, గుడిహత్నూర్ మండల పార్టీ అధ్యక్షుడు కరాడ్ బ్రహ్మనంద్, స్థానిక సర్పంచ్ జాదవ్ సునీత, వివిధ మండలాల కన్వీనర్లు నారాయణరెడ్డి, వెంకటేశ్, బోథ్ ఏఎంసీ చైర్మన్ రుక్మాన్సింగ్ పాల్గొన్నారు.