ఆసిఫాబాద్/వాంకిడి, మార్చి 31 : తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపడుతుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం వాంకిడి మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు భవిష్యత్ కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, ఈ తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలకున్న శక్తిసామర్థ్యాలు ప్రత్యర్థులకు లేవని, కార్యకర్తలే పార్టీకి శ్రీరామ రక్ష అన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు, వచ్చిన తర్వాత జరిగిన మార్పును అర్థమయ్యేలా వివరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపుతున్నదని, దేశ వ్యాప్తంగా 150 మెడికల్ కళాశాలలు మంజూరు చేస్తే, తెలంగాణకు మాత్రం ఒక్కటి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.
బీఆర్ఎస్ నాయకులను ఈడీ, ఇన్కంట్యాక్స్, సీబీఐ లాంటి సంస్థల ద్వారా బెదిరింపులకు గురిచేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రూ.600కు మించి పింఛన్లు ఇవ్వడం లేదని, తెలంగాణలో మాత్రం రూ.3 వేలకు పైగా ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు చేసిందేమీ లేదని, వారి మోసపూరిత మాటలను నమ్మవద్దని సూచించారు. స్వరాష్ట్రంలో రైతుల ఆదాయం పెరిగిందని, దేశానికే ధాన్యాన్ని అందించే స్థాయి కి ఎదిగామని చెప్పుకొచ్చారు. పక రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల రైతులు తెలంగాణలో కలవాలని కోరుకుంటున్నారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొందరు వస్తున్నారని, వారికి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. సమైక్య పాలనలో ప్రజలు తాగు నీటికి ఇబ్బందులు పడ్డారని, నేడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు నీరందిస్తున్నామని గుర్తు చేశారు. కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శ్రేణులు కష్టపడాలన్నారు. నెల రోజుల్లో సీఎం కేసీఆర్ జిల్లా కేంద్రానికి వస్తారని, నూతన కలెక్టరేట్ భవనాలను ప్రారంభిస్తారని తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలి : కోవ లక్ష్మి
ఉమ్మడి రాష్ట్రంలో మన ప్రాంతం ఎంతో వెనుకబడి పోయిందని, స్వరాష్ట్రం సిద్ధించాక ప్రగతి పథంలో దూసుకెళ్తున్నదని జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలు మధ్యవర్తిత్వం లేకుండా ఇంటింటికీ చేరుతున్నాయని తెలిపారు. ప్రణాళికాబద్ధంగా నియోజకవర్గంలోని అన్ని మండలాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కార్యకర్తలు నిరుత్సాహపడకుండా నూతన ఉత్తేజంతో పనిచేసి మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కోరారు. బీజేపీ, కాంగ్రెస్లు తెలంగాణకు చేసిందేమీ లేదని, ఆ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
పల్లెల ప్రగతే ధ్యేయం : ఎమ్మెల్యే ఆత్రం సక్కు
బీజేపీ, కాంగ్రెస్ల తప్పుడు ప్రచారాలను బీఆర్ఎస్ శ్రేణులు తిప్పికొట్టాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే సక్కు పిలుపునిచ్చారు. ఎకడైనా పార్టీ పరమైన సమస్యలుంటే తమ దృష్టికి తీసుకొచ్చి పరిషరించుకోవాలని సూచించారు. అన్ని గ్రామాలకు సీసీ, బీటీ రోడ్లు మంజూరు చేశామని, అటవీశాఖ అనుమతులు రావాల్సి ఉందన్నారు. పల్లెలను ప్రగతి పథంలో నడిపించడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నామన్నారు. యువతకు ఉపాధి కల్పించేందుకు మంత్రి కేటీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు.
చేసింది మనమే.. చేసేదీ మనమే : అరిగెల
తొమ్మిదేళ్లలో అభివృద్ధి చేసింది మనమే.. ఇకపై చేసేది కూడా మనమేనని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగెల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి పక రాష్ట్రాల ప్రజలు సీఎం కేసీఆర్ను ఆహ్వానిస్తున్నారన్నారు. ఇతర పార్టీల నాయకులు చెప్పే మాటలను నమ్మవద్దని సూచించారు. ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్లో తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను ఎందుకు ప్రవేశపట్టడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ నాయకులు అభివృద్ధిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు.
పార్టీకోసం కష్టపడాలి : కనక యాదవరావు
కార్యకర్తలు పార్టీ గెలుపుకోసం నిరంతరం కష్టపడాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్ కోరారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కూడా పొందుతున్నారని, మరి ఏ మొహంతో ప్రజల్లోకి వెళ్లి మద్దతు కావాలని అడుగుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు వేస్తే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు కోర్టులో కేసులు వేస్తూ అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. పార్టీ మండల అధ్యక్షుడు అజయ్ మాట్లాడుతూ వాంకిడి మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందామని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందన్నారు. అంతకుముందు పార్టీ ఆధ్వర్యంలో బైక్ర్యాలీ నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గాదవేణి మల్లేశ్, ఎంపీపీ విమలాబాయి, సర్పంచ్ తుకారాం, వైస్ ఎంపీపీ రాజ్కుమార్, నాయకులు ప్రవీణ్, దీపక్ముండే, మారుతి, మనోహర్, జయ రాం, దౌలాత్రావు, జంగు, కమలాకర్, పెంటు, అశోక్ ఉన్నారు.