నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 14: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ అంబేద్కర్ అందరివాడని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బాబాసాహెబ్ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వేచ్ఛ, సమానత్వమే జీవిత సూత్రాలుగా అంటరానితనానికి వ్యతిరేకంగా అంబేద్కర్ చేసిన పోరాటం చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. కుల, మత రహిత ఆధునిక భారతం కోసం అంబేద్కర్ తన జీవిత కాలం కృషి చేశారని గుర్తు చేశారు.
దళితులపై నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్ చేసిన పోరాటం మరువలేనిదని తెలిపారు. ఆయన ఖ్యాతిని గౌరవించేందుకే రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఇది దేశంలోనే అతి ఎత్తైన స్మారక చిహ్నంగా నిలువనుందని చెప్పారు. కలెక్టర్ వరుణ్ రెడ్డి, అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్డీవో స్రవంతి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, నాయకులు రాంకిషన్ రెడ్డి, ముడుసు సత్యనారాయణ, దళిత సంఘం నాయకులు కౌన్సిలర్లు తదితరులున్నారు.