భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఒకవైపు కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరుతుండగా.. నాయకులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ప్రచారంతో గులాబీ అభ్యర్థులు జోష్ నింపుతుండగా.. మహిళలు బతుకమ్మలు, హారతులతో స్వాగతం పలుకుతున్నారు. నిర్మల్ మండలంలోని తన సొంత గ్రామమైన ఎల్లపెల్లిలో నిర్మల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఇంద్రకరణ్రెడ్డి ప్రచారానికి శ్రీకారం చుట్టగా.. గ్రామస్తులు ఐకేరెడ్డి, బీఆర్ఎస్కే ఓట్లు వేస్తామని తీర్మానం చేశారు.
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని సాత్నాలలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఆదిలాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న హాజరయ్యాడు. వేలాది మంది పార్టీ శ్రేణులు, గిరిజనులు తరలిరాగా, ఈ ప్రాంతమంతా గులాబీ మయంగా మారింది. ఉట్నూర్లో ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్, ఇచ్చోడలో బోథ్ బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. తానూర్ మండల కేంద్రంలో పోచమ్మ, మహాలక్ష్మి, సాయిబాబా, మల్లన్న ఆలయంలో ముథోల్ బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్రెడ్డి ప్రత్యేక పూజలు చేసి, పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
సోన్, అక్టోబర్ 18: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, 60 ఏళ్లు పాలించిన కాంగ్రెసోళ్లు ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుతున్నారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ప్రశ్నించారు. నిర్మల్ మండలంలోని తన స్వగ్రామం ఎల్లపెల్లిలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మొదటిసారిగా ఎన్నికల ప్రచారానికి వస్తున్న బీఆర్ఎస్ నిర్మల్ అభ్యర్థి, మంత్రికి గ్రామస్తులు, బీఆర్ఎస్ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
గ్రామ శివారు నుంచి గ్రామ పంచాయతీ వరకు డప్పుచప్పుళ్లతో స్వాగతం పలికారు. మొదటగా మంత్రి ఇంద్రకరణ్రెడ్డితోపాటు సతీమణి విజయలక్ష్మి, కుటుంబసభ్యులు అల్లోల గౌతంరెడ్డి, దివ్యారెడ్డి, మురళీధర్రెడ్డి, వినోదమ్మ, సురేందర్రెడ్డిలు దుర్గామాత, అంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుమ్రం భీం, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం సొంతింట్లో తల్లిదండ్రుల చిత్రపటాలకు పూలమాలలు వేసి మంత్రి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎల్లపెల్లిలో ఓపెన్టాప్ జీపుపై కుటుంబసభ్యులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోతో రాష్ట్రంలో సంతోషం వెల్లివిరిసిందని చెప్పారు. గ్రామంలో పెద్ద ఎత్తున మంత్రి అల్లోలకు గ్రామస్తులు పూలవర్షాన్ని కురిపించారు. ఈ సందర్భంగా గ్రామస్తులందరూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నిర్మల్ నియోజకవర్గ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్రెడ్డికి కృషి చేస్తున్న ఐక్యంగా ఓట్లు వేస్తామని తీర్మానం చేశా రు. ఎల్లపెల్లిలో మంత్రి అల్లోల సహకారంతో ఎంతో అభివృద్ధి జరిగిందని అర్హులైన వారికి డబుల్బెడ్రూం ఇండ్లు, బీసీబంధు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదిముబారక్, ఆసరా పెన్షన్లు తదితర పథకాలను దరి చేరాయన్నారు.
గ్రామంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వెంట ఉంటామని చెప్పాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వంద సీట్లతో హ్యాట్రిక్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నవంబర్ 2న ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ఎఫ్ఏసీఎస్ మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ నిర్మల్ మండల కన్వీనర్ గోవర్ధన్రెడ్డి, గ్రామ సర్పంచ్ అల్లోల రవీందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్రెడ్డి, నిర్మల్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, మాజీ సర్పంచ్ భీంరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేశ్, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణప్రసాద్రెడ్డి, నాయకులు పాకాల రాంచందర్, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.