దిలావర్పూర్, జూన్ 18: మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం మాడెగాం గ్రామంలో నిర్మించిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లో మంచినీళ్ల పండుగను ఘనంగా నిర్వహించారు. నిర్మల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు భగీరథనీటి శుద్ధి గురించి వివరించారు. అనంతరం మంత్రి, కలెక్టర్ ప్రజాప్రతినిధులు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో తిరిగారు. ఈ సం దర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం వచ్చిన తర్వాత చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు తన రాజకీయ జీవితంలో ఎప్పుడు చూడలేదని అన్నారు. గతంలో గ్రామాల్లోకి తాము, కలెక్టర్ వస్తున్నారంటే మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళన చేసేవారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మహిళల కన్నీరు తుడిచేందుకు మిషన్ భగీరథ పథకం అమలు చేసి ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నారని తెలిపారు. రూ.1500 కోట్లు వెచ్చించి నిర్మల్ నియోజక వర్గంలో మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టామని అన్నారు. నియోజక వర్గంలోని 50వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్యాకేజీ- 27 పనులు త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు.
మిషన్ భగీరథ నీరు తాను రోజు ఇంటి వద్ద తాగుతానని, మీరందరు కూడ వాటిని వినియోగించుకోవాలని సూచించారు. ఇంతటి అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి ఆదరించాలని కోరారు. కలెక్టర్ వరుణ్రెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లా వాసిగా అక్కడి ప్రజలు ఫ్లోరోసిస్ వ్యాధితో బాధపడే వారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో మిషన్ భగీరథ పథకం అమలు చేసి ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నారని తెలిపారు. ఈ నీరు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో స్రవంతి, సర్పంచ్ సరితారాజు, ఎంపీపీ అక్షర, మిషన్ భగీరథ ఈఈ సందీప్, డీఈ అంజన్కుమార్, ఏఈ రాజశేఖర్, తహసీల్దార్ కరీం, ఎంపీడీవో మోహన్, ఎంపీవో అజీజ్ఖాన్, సహకార సంఘం చైర్మన్ రమణారెడ్డి, జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు డాక్టర్ సుభాష్రావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొమ్ముల దేవేందర్రెడ్డి, అనిల్, రాంకిషన్రెడ్డి, కదిలి కాల్వ ఆలయాల చైర్మన్లు భుజంగ్రావ్, చిన్నయ్య, కదిలి ఆలయ మాజీ చైర్మన్ సంబాజీపటేల్, అనిల్, శ్రీనివాస్, సప్పల రవి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.