సోన్, మే 28 : జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ పకబ్బందీ చర్యలు తీసకుంటున్నదిన రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. పొల్యుషన్ కంట్రోల్ బోర్డు, మున్సిపల్, మంత్రి సహకారంతో నిర్మల్లోని రూరల్ పోలీస్ష్టేషన్లో ఏర్పాటు చేసిన 100 సీసీ కెమెరాల కంట్రోల్ రూంను కలెక్టర్ వరుణ్రెడ్డి, ఎస్పీ ప్రవీణ్కుమార్లతో కలిసి మంత్రి అల్లోల ఆదివారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. నేరాల నియంత్రణకు, నేర పరిశోధనకు సీసీ కెమెరాలు ఎంతో దోహదం చేస్తాయన్నారు.
గతంలో జరిగిన నేరాల్లో నిందితులను పట్టించిన సందర్భాలను గుర్తు చేశారు. ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అతిక్రమిస్తే జరిమానాలు తప్పవని, కేసులు నమోదవుతాయని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నిర్మల్ రూరల్ పోలీస్స్టేషన్లో కమాండ్ కంట్రోల్రూం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పట్టణంలో ఆయా చోట్ల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును కమాండ్ కంట్రోల్ రూంలో పరిశీలించి పోలీసులను అభినందించారు. అంతకుముందు పోలీస్స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎఫ్ఏసీఎస్ మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, బీఆర్ఎస్ యువ నాయకుడు అల్లోల గౌతంరెడ్డి, పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, డీఎస్పీ జీవన్రెడ్డి, సీఐలు మల్లేశ్, శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్సైలు రావుల దేవేందర్, రాజశేఖర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజలందరూ భక్తిభావం అలవర్చుకోవాలి
నిర్మల్ అర్బన్, మే 28 : ప్రజలందరూ భక్తిభావాన్ని అలవర్చుకోవాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. పట్టణంలోని గాంధీచౌక్ కాలనీలోని భగవాన్ మురళీకృష్ణ ఆలయ 13వ వార్షికోత్సవాలకు మంత్రి అల్లోల హాజరయ్యారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో మంత్రి పూజలు చేశారు. నిర్మల్ జిల్లా ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతున్నదని, 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో 600 ఆలయాలను నిర్మించుకున్నామని మంత్రి వెల్లడించారు.
తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీఆర్
తెలుగు ప్రజల ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. తామంతా ఆయన అభిమానులమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, భూషన్ రెడ్డి, భూషన్ రెడ్డి, ఆకోజి కిషన్, గండ్రత్ రమేశ్, ఆలయ కమిటీ బాధ్యులు పోలిశెట్టికిషన్, శ్రీనివాస్, సత్యనారాయణ, పద్మనాభగౌడ్, రజినీ, మంగమ్మ, విజయలక్ష్మి, గణేశ్, లక్ష్మీనారాయణ, రాజేందర్, రవి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, ఎన్టీయార్ అభిమానులు పాల్గొన్నారు.