‘భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) కార్యకర్తలు, నాయకులే మా బలం.. బలగం. దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. వీటిని ఇంటింటికీ చేర్చాల్సిన బాధ్యత మనపై ఉంది’ అని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండల కేంద్రంలోని డీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుట్ర చేస్తున్నాయని, వీటిని ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధిని గమనిస్తున్న మహారాష్ట్రవాసులు తెలంగాణ రాష్ట్రంలో కలుపాలని కోరుకుంటున్నారన్నారు. కాగా.. నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని జవుళా(బీ) గ్రామంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో జిల్లా కో-ఆర్డినేటర్, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి.. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పాల్గొన్నారు.
– లక్ష్మణచాంద/తానూర్/తలమడుగు, మార్చి 26
లక్ష్మణచాంద, మార్చి 26 : భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) కార్యకర్తలే మా బలగం అని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం కేంద్రంలోని డీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్ష్మణచాంద బస్టాండ్ నుంచి ఫంక్షన్ హాల్ వరకు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ పతాకాన్ని ఆవిష్కరించారు. సమావేశానికి వచ్చిన కార్యకర్తలకు వేసవితాపం తీర్చడానికి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అంబలి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రగతిపథంలో నిర్మల్ నియోజకవర్గ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలు, సూచనలను రెండు గంటలపాటు ఓపికగా విన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అమరుల త్యాగాలు, ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంటే, రాష్ర్టాన్ని అంధకారంలోకి నెట్టడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. అమరుల కుటుంబాలకు కేసీఆర్ అండగా ఉంటున్నారని, ఇందుకు ఎల్బీ నగర్లోని బ్రిడ్జికి శ్రీకాంతాచారి పేరు పెట్టడమే నిదర్శనమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుట్ర చేస్తున్నాయని, ప్రజలు వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బండి సంజయ్, రేవంత్రెడ్డి ఎక్కడైన కనిపించారా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని గమనిస్తున్న మహారాష్ట్రవాసులు తెలంగాణ రాష్ట్రంలో కలుపాలని కోరుకుంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం సాగుకు విద్యుత్ మోటర్లకు మీటర్లు అమర్చాలని రాష్ట్రంపై ఒత్తిడి చేసినా కేసీఆర్ ఒప్పుకోలేదన్నారు. విద్యుత్ పంపులకు మీటర్లను అమర్చితే రాష్ర్టానికి రూ.30 వేల కోట్లు అందిస్తామని కేంద్రం చెప్పినా, రైతు శ్రేయస్సే ముఖ్యమని భావించారని పేర్కొన్నారు.
యాసంగి ధాన్యం కొంటాం..
కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా.. యాసంగి వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి అల్లోల భరోసా ఇచ్చారు. రూ.1200 కోట్లతో వెల్మల్ బొప్పారంలో ఏర్పాటు చేసిన 400 కేవీ సబ్స్టేషన్తో నిర్మల్ జిల్లాకు సౌకర్యవంతగా మారిందన్నారు. నిర్మల్ జిల్లాలో ఇప్పటికే 100 యూనిట్ల పంపిణీ చేశామన్నారు. మరో 1100 యూనిట్లను త్వరలో అందిస్తామని తెలిపారు. కేసీఆర్ను ఓడించలేక కేంద్ర ప్రభుత్వం కవితపై ఈడీతో అక్రమ కేసులు పెట్టిస్తున్నదన్నారు. రూ.400 సిలిండర్ ధరను రూ.1200 పెంచిన కేంద్ర ప్రభుత్వానికి మహిళల ఉసురు తగులుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్రెడ్డి, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ కొప్పుల ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, టీఆర్ఎస్ యువ నాయకుడు, మంత్రి తనయుడు గౌతంరెడ్డి , రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ అడ్వాల పద్మ, జడ్పీటీసీ రాజేశ్వర్, బీఆర్ఎస్ మండల ఇన్చార్జి సురేందర్రెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ కొరిపెల్లి కృష్ణారెడ్డి, నాయకులు అడ్వాల రమేశ్, కొండ్ర నరేశ్రెడ్డి, సీరాజొద్దీన్, జహీరొద్దీన్, కేశం రమేశ్ పాల్గొన్నారు.
కల నెరవేర్చారు..
బాబాపూర్ చెక్క నుంచి బాబాపూర్ గ్రామానికి సరియైన రోడ్డు లేకపోవడంతో గ్రామ ప్రజలు అవస్థలు పడ్డారని బాబాపూర్ సర్పంచ్ శ్రీవిద్య పేర్కొన్నారు. మంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తమ గ్రామానికి రోడ్డు వేసి ఏండ్ల కలను నెరవేర్చారని తెలిపారు. బాబాపూర్ నుంచి వడ్యాల్కు ప్రజల అవసరాలు గుర్తించిన మంత్రి తారురోడ్డు వేయించారన్నారు. బాబాపూర్ రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసిన ఘనత మంత్రికే దక్కుతుంది.
– శ్రీవిద్య, సర్పంచ్ బాబాపూర్
లక్ష్మణచాంద మండల ప్రజలంతా మంత్రి వైపే
లక్ష్మణచాంద మండలానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిధులు అందించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని లక్ష్మణచాంద ఎంపీపీ అడ్వాల పద్మ తెలిపారు. గత ఎన్నికల్లో లక్ష్మణచాంద మండలం మంచి మెజారిటీ అందించింది. ఈసారి మంత్రి చేసిన అభివృద్ధిని చూసి ప్రజలంతా మంత్రివైపే ఉన్నారు. ప్రతిపక్ష నాయకులు పాదయాత్రలు కాదు, మోకాళ్ల యాత్ర చేసిన ఎవరూ నమ్మరన్నారు.
– అడ్వాల పద్మ, ఎంపీపీ లక్ష్మణచాంద
అడుగాగనే సబ్స్టేషన్ మంజూరు చేశారు..
తమ గ్రామానికి సబ్స్టేషన్ ఏర్పాటు చేయాలని మంత్రి ఇంద్రకరణ్రెడ్డిని కోరగానే మంజూరు చేశారని రాచాపూర్ ఎంపీటీసీ రమ తెలిపారు. ప్రస్తుతం సబ్స్టేషన్ నిర్మాణం పూర్తయింది. పెద్దమ్మ ఆలయం కావాలని అడుగగానే రూ.15 లక్షలు మంజూరు చేశారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధులు పూర్తిగా అందించారన్నారు. రాచాపూర్ ప్రజలు మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిని మరువరని పేర్కొన్నారు. గ్రామానికి ఏది కావాలన్నా వెంటనే మంజూరు చేస్తున్నారని తెలిపారు.
– రమ, ఎంపీటీసీ రాచాపూర్
చెప్పినదానికన్న ఎక్కువ అభివృద్ధి జరిగింది..
ఎన్నికల సమయంలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి చెప్పినదానికన్నా ఎక్కువ అభివృద్ధి చేసి చూపించారని జడ్పీటీసీ ఓస రాజేశ్వర్ పేర్కొన్నారు. లక్ష్మణచాంద మండల అభివృద్ధికి తాము అడిగిన వాటికన్నా ఎక్కువ నిధులు అందించి అభివృద్ధి చేశామన్నారు. లక్ష్మణచాందకు డబుల్ రోడ్డు, నిర్మల్ నుంచి కనకాపూర్ వరకు నాలుగు వరుసల రోడ్డు ఏర్పాటు చేసి రోడ్ల రూపురేఖలు మార్చారన్నారు. మండలంలో ఏ గ్రామంలో చూసినా ఎక్కడా మట్టిరోడ్లు లేకుండా సీసీ రోడ్లకు నిధులు అందించారన్నారు. మంత్రి చేసిన అభివృద్ధిని ప్రజలు మరిచిపోరన్నారు.
– ఓస రాజేశ్వర్, జడ్పీటీసీ