ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా రెండో విడుత ‘కంటి వెలుగు’ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఖమ్మం జిల్లాలో బుధవారం సీఎం కేసీఆర్ అంకురార్పణ చేయగా.. గురువారం పల్లెలు, పట్టణాల్లో ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి శిబిరాలను ప్రారంభించారు. నిర్మల్ జిల్లాలో అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ముథోల్లో ఎమ్మెల్యే విఠల్రెడ్డి, ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్లో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ప్రారంభించారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు శిబిరాలను పరిశీలించి, సూచనలు చేశారు. కండ్ల సమస్యలు ఉన్న వారు ఉదయమే శిబిరాలకు చేరుకొని బారులుదీరారు. వైద్యులు పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు, కండ్లద్దాలు అందజేశారు. ఇబ్బంది కలుగకుండా అధికారులు కుర్చీలు, మంచినీరు, టెంట్లను ఏర్పాటు చేశారు.
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గురువారం రెండో విడుత ‘కంటి వెలుగు’ కార్యక్రమం ప్రారంభమైంది. తొలి రోజు 33 ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించగా.. భారీ స్పందన లభించింది. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించడంతో ప్రజలు తరలివచ్చారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. కుర్చీలు, మంచినీరు, ఇతర సౌకర్యాలు కల్పించారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డులో గల యూత్ ట్రెయినింగ్ సెంటర్, ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలి పీహెచ్సీలో ఏర్పాటు చేసిన శిబిరాలను ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు. బోథ్ ప్రభుత్వాస్పత్రిలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. శిబిరాలకు వచ్చిన వారికి వైద్యులు, సిబ్బంది అవసరమైన పరీక్షలు నిర్వహించి మందులు, అద్దాలు పంపిణీ చేశారు.
– ఆదిలాబాద్/నిర్మల్,జనవరి 19(నమస్తే తెలంగాణ)
నిర్మల్ జిల్లావ్యాప్తంగా ‘కంటి వెలుగు’ కార్యక్రమాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని గొల్లపేట, బంగల్పేట్, కురాన్నపేట్, ద్యాగవాడ కాలనీల్లో ఏర్పాటు చేసిన శిబిరాలను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీతో కలిసి అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ప్రారంభించారు. అలాగే లక్ష్మణచాంద మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని కూడా ప్రారంభించారు. నిర్మల్ పట్టణంలోని గొల్లపేట బీసీ సంఘ భవనంలో మంత్రి కంటి పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు చూపును పరీక్షించి అద్దాలను సిఫారసు చేశారు. ముథోల్లోని పశుపతినాథ్ శివాలయం ఆవరణలో ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విఠల్రెడ్డి ప్రారంభించారు. మామడ మండలం తోటిగూడలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఖానాపూర్ పట్టణంలోని సుభాష్నగర్తోపాటు మండలంలోని పాత తర్లపాడ్ గ్రామంలో అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కడే ప్రారంభించారు. ఆయా మండలాలు, గ్రామాల్లో జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు.
చిత్రంలో కనిపిస్తున్న వృద్ధ దంపతులు శంకరయ్య(90), సుశీలబాయి(85). వీరిది ఆదిలాబాద్లోని శ్రీరాంకాలనీ. ఐదో వార్డులోని యూత్ ట్రెయినింగ్ సెంటర్లో కంటి పరీక్షలు చేసుకోవడానికి వచ్చారు. స్థానిక కౌన్సిలర్ శ్రీలత దగ్గరుండి తీసుకెళ్లారు. వైద్యులు కండ్లు పరీక్షించి మందులు, కండ్లద్దాలు ఇచ్చారు. సంతోషంగా ఇంటికి వెళ్లారు. ‘నమస్తే’ వారిని పలుకరించగా.. కేసీఆర్ సారు ముసలొళ్లకు మంచి పనులు చేస్తున్నట్లు వెల్లడించారు. వృద్ధాప్య పింఛన్ ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు వారి వార్డులోనే, ఇంటి దగ్గరే, కష్టం కాకుండా కండ్ల పరీక్షలు చేసినట్లు వివరించారు. తమ వంటి వారి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న సీఎం సారుకు మా దీవెనలు ఉంటాయని పేర్కొన్నారు.
నా పేరు లలిత. మాది మంచిర్యాల జిల్లా అంకతిపల్లి. నాకు చాలా రోజులుగా కండ్ల నుంచి నీరు కారుతున్నది. యేడాదిన్నరగా దగ్గరి చూపు లేదు. ఐదుసార్లు ప్రైవేట్ దవాఖానలో చూపిం చుకున్న. ఇప్పటివరకు రెండు వేలు ఖర్చయ్యాయి. అయినా కండ్లు సరిగ్గా కనిపించడం లేదు. సీఎం కేసీఆర్ సారు అందరికీ కంటి పరీక్షలు చేయాలని చెప్పిండని విన్నా. ఈ రోజే మా వద్దకు డాక్టర్లు వచ్చి పరీక్షలు చేశారు. నేను కూడా చేయించుకున్నా. మంచిగ చూశారు. మందులు, కండ్లద్దాలు ఇచ్చారు. సంతోషంగా ఉంది. మా వంటి పేదోళ్ల కోసం మంచి కార్యక్రమం తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ సారుకు ధన్యవాదాలు.