కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ) : నిజాం కాలంలో 1938లో స్థాపించబడి.. దేశంలోనే పురాతనమైన పేపర్మిల్లుగా ప్రసిద్ధిగాంచింది. 1943లో ఎస్పీఎంలో పేపర్ ఉత్పత్తి ప్రారంభమైంది. వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తూ లాభాల బాటలో సాగిన ఈ పేపర్ మిల్లు.. ఆపై యాజమాన్యాల చేతులు మారి క్రమంగా నష్టాల బాటపట్టింది. సమైక్య పాలకుల పట్టింపులేని తనంతో ఎన్నో ఒడిదొడుకుల మధ్య 2014లో మూతబడింది. దీంతో ప్రత్యక్షంగా.. పరోక్షంగా వేలాది మంది కార్మిక కుటుంబాలు వీధినపడ్డాయి. తిరిగి స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు చొరవతో పున:ప్రారంభమై కొనసాగుతోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎస్పీఎం పరిస్థితి మారిపోయింది. వేలాది మంది కార్మికులకు ఉపాధిని కల్పించే పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవతో చేయుతనందించడంతో ఎస్పీఎం తిరిగి పునఃప్రారంభమైంది. 2014లో మూతబడిన ఎస్పీఎం ప్రభుత్వం కల్పించిన రాయితీలతో కొత్త యాజమాన్యం ఆధ్వర్యంలో 2018 ఆగస్టులో తిరిగి ప్రారంభమైంది. సమైక్యపాలనలో పరిశ్రమ మూతపడడంతో రోడ్డున పడ్డ వందలాది మంది కార్మికులకు తిరిగి ఉపాధి దొరికింది. ఐదేళ్లుగా ఎస్పీఎంలో తిరిగి పేపర్ ఉత్పత్తి అవుతోంది. వందలాది మంది కార్మికుల కుటుంబాల్లో సంతోషం నిండింది. వందలాది మంది కార్మికులకు ఉద్యోగాలు, ఉపాధి కలగడంతో కాగజ్నగర్ పట్టణంలో వ్యాపార వాణిజ్యాలు తిరిగి పూర్వ వైభవం సంతరించుకున్నాయి. నేడు ప్రత్యేక్షంగా, పరోక్షంగా 1500 మంది ఉపాధి పొందుతున్నారు.
ఎస్పీఎం ప్రయాణం ఇది..
1938 లో ప్రారంభమై బిర్లా (పోదారిస్) యాజమాన్యంలో స్థాపించబడిన పేపర్ మిల్లులో 1943లో పేపర్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఆ తరువాత 1950లో ఎస్పీఎం పూర్తిగా బిర్లాగ్రూప్ ఆధీనంలోనికి వెళ్లింది. అప్పటి నుంచి పేపర్ ఉత్పత్తి నిరాటకంగా సాగింది. ఆరు రకాల పేపర్లను కంపెనీలో ఉత్పత్తి చేసేవారు. రోజుకు 300 టన్నుల పేపర్ ఉత్పత్తి అయ్యేది. 2007-08 లో కంపెనీలో రెండు కొత్త యంత్రాలను ఏర్పాటు చేసి ఉత్పత్తిని మరింత పెంచాలనే లక్ష్యంగా ఐడీబీఐ(ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) లో మిల్లుని తాకట్టు పెట్టి రూ.350 కోట్ల రుణాన్ని యాజమాన్యం తీసుకుంది. అప్పటి నుంచి కంపెనీకి కష్టాలు మొదలయ్యాయి. తీసుకున్న రుణాలను కంపెనీ అభివృద్ధికి వినియోగించకపోవడంతో కంపెనీ నష్టాల బాటపట్టింది. దీంతో 2014 సెప్టెంబర్ 27న యాజమాన్యం కంపెనీని షట్డౌన్ పేరిట మూసేసింది. కంపెనీ మూసే నాటికి 3,200 మంది కార్మికులు పనిచేస్తున్నారు.
వీరిలో 1,550 మంది పర్మినెంట్ కార్మికులు కాగా, 1,150 మంది కాంట్రాక్టు వర్కర్స్, 500 ఇతర స్టాఫ్ ఉన్నారు. వీరే కాకుండా వందలాది మంది కార్మికులు పరోక్షంగా ఎస్పీఎం ద్వారా ఉపాధిని పొందేవారు. ఎస్పీఎం యాజమాన్యం ఐడీబీఐ వద్ద తీసుకున్న రూ. 350 కోట్ల రుణం వడ్డీలతో కలిపి రూ.422 కోట్లకు చేరింది. యాజమాన్యం అప్పులు తీర్చక పోవడంతో, 2016 అక్టోబర్ 22న మిల్లుని ఐడీబీఐ స్వాధీనం చేసుకుంది. దీంతో కార్మికుల్లో ఆందోళన మొదలైంది. ఐడీబీఐలో తీసుకున్న అప్పులతోపాటు ఇంటీరియర్ రిపొల్యుషన్ (ఎన్సీఎల్టీ) అంటే కంపెనీకి ఉన్న అప్పులు, ఆస్తులను గుర్తించారు. ముడిసరుకు బకాయిలు 200 కోట్లు, కార్మికులుకు చెల్లించాల్సిన వేతనాలు రూ.70 కోట్లు ఉన్నట్లు గుర్తించారు. మూతబడిన మిల్లుని ఎలాగైనా తిరిగి పునరుద్ధరించాలని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రయత్నాలు చేశారు. ట్రిబ్యునల్ తీర్పుతో నాలుగేళ్ల తరువాత మళ్లీ కాగజ్నగర్ కాగితపు పరిశ్రమ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా 2018 ఆగస్టులో తిరిగి ప్రారంభమైంది. జేకే కంపెనీ టేకోవర్ చేసేందుకు ముందుకు వచ్చింది. ఎస్పీఎంను కార్మికులతోపాటు పూర్తిస్థాయిలో తన ఆధీనంలోకి తీసుకొని రూ.628 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు జేకే కంపెనీ ముందకు రావడంతో.. ప్రభుత్వం పలు రకాల రాయితీలను కల్పిస్తూ జీవో 18ని విడుదల చేసింది.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కార్మికుల్లో భరోసా కల్పించింది. 2018 ఆగస్టు 2న కేటీఆర్ చేతుల మీదుగా పునరుద్ధరణ పనులు ప్రారంభించిన యాజమాన్యం శరవేగంగా మిల్లుని పునరుద్ధరించింది. 2019 ఫిబ్రవరి 7న ఎస్పీఎంలో తిరిగి పేపర్ ఉత్పత్తి మొదలైంది. సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యంతో మూతబడిన సిర్పూర్ పేపర్మిల్లు మళ్లీ స్వరాష్ట్రంలో సగర్వంగా ప్రారంభమైంది.