మంచిర్యాల, జూన్ 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గతంల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పంట కాలానికి ముందు ఎరువుల కోసం రైతన్నలు అరిగోస పడేవారు. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, వ్యవసాయ కార్యాలయాల వద్ద జాగారం చేసేవారు. ఎండనక, వాననక, చలనక రాత్రింబవళ్లు పిల్లాపాపలతో సద్దన్నం వెంట తెచ్చుకొని పడిగాపులు కాసేవారు. యాస్టకొచ్చి టోకెన్లు, పాదరక్షలు, పట్టా పాసుపుస్తకాలు క్యూలో పెట్టేవారు. కొన్ని సందర్భాలలో ఎరువులు దొరకని పరిస్థితుల్లో దుకాణాల్లోకి చొరబడి లూటీ చేసేవారు. అదుపు చేయడానికి పోలీసులు లాఠీలకు పని చెప్పేవారు. లాఠీలు విరిగి రక్తం చిందిన సందర్భాలు అనేకం. కానీ.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి ఎరువుల కరువనే ముచ్చటే లేదు. సీజన్కు ముందే గుట్టలు గుట్టలుగా అగ్రికల్చర్ ఆఫీసుల్లో నిల్వలు ఉంటున్నాయి. రైతులకు వీలున్నప్పుడు సులువుగా, సౌకర్యవంతంగా తీసుకెళ్తున్నారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరంటుతో సాగు విస్తీర్ణం పెరిగినా ఎరువుల కరువు కనిపించడం లేదు.
వానకాలం సాగు సీజన్ మొదలైంది. రైతులు భూమిని సిద్ధం చేసుకుంటుండగానే వారి ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమవుతున్నాయి. ఓ వైపు విత్తనాలు వేసుకుంటూ, వరి నారు పోసుకుంటూనే.. పంటకు కావాల్సిన ఎరువులు ఎట్లా అని రైతన్నలు ఆలోచనలో పడ్డారు. గత పాలనలో ఎరువుల కోసం కొట్లాట.. రోజుల తరబడి క్యూ లైన్లు, ఎరువుల కోసం పోయి చెప్పులు, ఇతర వస్తువులు లైన్లో పెట్టి ఎదురుచూడాల్సిన దుస్థితి. ఓపిక నశించి గ్రోమోర్లు, షాపుల మీదకు పోతే పోలీసుల లాఠీలు రైతుల వీపుల మీద ఇరిగేటివి. ఇంత అరిగోస పడినా సరిపడా ఎరువులు దొరికేవి కాదు. కానీ.. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. పెద్ద రైతు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగానే అప్రమత్తమై సీజన్ ప్రారంభానికి ముందే ఎరువులు తెప్పించి జిల్లాల్లో అందుబాటులో పెడుతున్నారు. అలాగే ఈ వానకాలానికి సంబంధించిన ఎరువులు మార్చి, ఏప్రిల్లోనే వచ్చేశాయి. బఫర్ స్టాక్తోపాటుగా వ్యవసాయ శాఖ అంచనాల మేరకు అవసరమయ్యే ఎరువులను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చారు. గతేడాది వానకాలంలో వినియోగించిన ఎరువుల వాడకాన్ని అనుసరించి ఈ సారి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
ఎరువులకు రంది లేదు..
వానకాలం సీజన్ ప్రారంభంలో ఎరువులు దొరకలేదంటే దిగుబడిపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. అలాంటి ఇబ్బందులు రాకుండా జిల్లా యంత్రాంగం ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే సహకార సంఘాలకు ఇప్పటికే ఎరువులను తరలించింది. మంచిర్యాల జిల్లాలో 2023 వానకాలం సీజన్లో 3 లక్షల ఎకరాలు సాగు అవనుంది. జిల్లాకు ఈ సీజన్లో యూరియా 49,450 మెట్రిక్ టన్నులు, డీఏపీ 19,200 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 18 వేల మెట్రిక్ టన్నులు అవసరం అవుతుందని అంచనా వేశారు. కాగా.. జిల్లాలో ఇప్పటికే యూరియా 6,850 మెట్రిక్ టన్నులు, డీఏపీ 800 టన్నులు, కాంప్లెక్ 4,350 మెట్రిక్ టన్నులు బఫర్ స్టాక్ ఉంది. నిర్మల్ జిల్లాలో 4.10 లక్షల ఎకరాలు సాగులోకి రానుండగా, ఈ సీజన్కు యూరియా 32 వేలు, డీఏపీ 9 వేలు, కాంప్లెక్స్ 12,500 మెట్రిక్ టన్నులు అవసరం అవుతుందని అంచనా ఉండగా, యూరియా 9,200, డీఏపీ 2,350, కాంప్లెక్స్ 4,650 మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ అందుబాటులో ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో 5.66 లక్షల ఎకరాలు సాగులోకి రానుండగా, యూరియా 30 వేలు, డీఏపీ 13 వేలు, కాంప్లెక్స్ 7వేల మెట్రిక్ టన్నులు అవసరమనే అంచనా ఉండగా, యూరియా 9,013, డీఏపీ 5,525, కాంప్లెక్స్ 127 టన్నుల బఫర్ స్టాక్ ఇప్పటికే సరఫరా జరిగింది. ఆసిఫాబాద్ జిల్లాలో సాగు అంచనా 1.45 లక్షల ఎకరాలు ఉండగా, యూరియా 45,060, డీఏపీ 11,265, కాంప్లెక్స్ 22,538 మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయనేది అంచనా. కాగా అన్నీ కలిపి 25 వేల పైచిలుకు మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ అందుబాటులో ఉంది.
ధరలు పెంచిన మోదీ సర్కారు
రైతులు ఎరువులకు ఇబ్బందులు పడొద్దనేది సీఎం కేసీఆర్ కృషి చేస్తుంటే.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచి రైతులపై పెనుభారాన్ని మోపుతున్నది. కేంద్రం నిర్ణయంతో సాగుపై తీవ్రంగా ప్రభావం పడనుంది. సాగులో కీలకమైన విత్తనాలు, ఎరువులను అమాంతం పెంచడంతో ఎకరానికి రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు అయ్యే ఖర్చు, పెరిగిన ధరల కారణంగా అదనంగా మరో రూ.1000 నుంచి రూ.2వేలకు పెరగనుంది. ఉదాహరణకు రైతులు ఉపయోగించే పొటాష్(ఎంవోపీ) పాత ధర రూ.850 ఉంటే ప్రస్తుతం రూ.1,700 దాటిపోయింది. దీంతో ఒక్క ఆ ఎరువుమీదే రూ.850 పెరుగుల కనిపిస్తోంది. ఇలా ఎరువుల ధరను కేంద్రం 50 శాతం మేర పెంచడంతో రైతులకు తిప్పలు తప్పేలా లేవు. దీంతో సాగుపై ఆధారపడి జీవిస్తున్న వారిపై మోదీ సర్కారు కఠినంగా వ్యవహరిస్తున్నదని రైతన్నలు మండిపడుతున్నారు. రైతుల పక్షాన నిలబడుతున్న కేసీఆర్ సర్కారును చూసైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవుపలుకుతున్నారు.
ఎర్వులు.. యిత్తనాలకు పొద్దుగాల్నే లైన్ కట్టేది..
తెలంగాణ రాక ముందు రైతుల గోస సెప్పక్కర్లేదు.. యిత్తనాలుం డవు. ఎర్వులుండవు. ఇగ కరంటై తే ఎప్పుడత్తదో తెల్సేది కాదు. గా కట్టం గిప్పుడేడుంది. ఎవుసాన్ని రోజొక పండుగలెక్క సేత్తున్నం. అప్పట్ల చేన్ల యిత్తనాలు అలుకాలన్నా, యిత్తనాలు తేవాలన్నా పొద్దుపొద్దున అంటే మస్కులనే పోయి సొసైటీ కాడ లైను కట్టేటోల్లం. అక్కడ్నే మొఖం కడుక్కునేటోల్లం. ఎండ బాగా కొడితే మా చెప్పులు లైనుల పెట్టి ఉండేటోల్లం. యిత్తనా లకే కాదు ఎర్వులకు కూడా గిట్లనే. ఇగ బయట కొమట్ల దగ్గర కొందామంటే వంద ఎక్కువ. ఇందుల ఉద్దెర పెడితే ఇగ అంతే. ఇక పొద్దుగాల లైన్ల నిలబడితే రాత్రయ్యేది. అది కూడా పాసు పుస్తకం మీద ఎక్రంకు ఒక్కటే బత్త ఇచ్చేటోల్లు. మళ్లా కావాలంటే మూడ్రోజులకు పోతే లైను కట్టుడేనాయే. ఆ గోస సూత్తే ఇగ ఎవుసం సేసుడే దండగా అనుకునేటోల్లం. కేసీఆర్ పుణ్యమాని తెలంగాణ వచ్చుడు మాలాంటి రైతుల బతుకుల్లో సంతోషం తెచ్చిండు. ఆనాకాలం, ఎండాకాలం పంటకు ముం దే యిత్తనాలు అత్తున్నయ్. ఎర్వులైతే ఫుల్.. గిట్ల పొలంకు పోయేటప్పుడు దుకాణంలకు బండి కట్టుకొని పోయి తీసుకు పోతున్నం. ఎంత సౌలత్ అయ్యిందంటే ఎవుసం చేద్దామంటే సంతోషంగా సేత్తున్నం. నాడు బీడ్లుగా ఉన్న భూములన్నీ గిప్పుడు పంటలు తీయబడ్తిమి. పెట్టుబడి కింద ఎక్రానికి ఐదు వేలియ్యవట్టే. ఇగ కొమట్లతోని, సావుకార్ల పీడపోయే. గిప్పుడు పంటకు నీల్లు పెట్టి పొద్దుగూకక ముందే ఇంట్లుండబడితిమి.. చెర్ల లోతు తవ్వే నీళ్లు మంచిగా నిల్వుండవట్టే. గప్పుడు పంట పండినంక సావుకార్లు సెప్పిన ధరకిచ్చుడాయే.. గిప్పుడు ఒక్కో పంటకు కింటాలుకు గింత అని ధర పెట్టి కొనుక్కుపోబట్టే.. రోడ్డు మీద పోయేటప్పుడు, ఏదైనా అనుకోకుండా పురుగో, బుసో కుట్టి సత్తే ఇంట్ల పోరగాండ్లకు ఐదు లక్షలు ఇయ్యవట్టే.. ఇంకా ఏం గావాలి రైతుకు… రైతుల కట్టాలు తెల్సిన కేసీఆర్ ఒక్కొటెన్క ఒక్కటి ఇస్తూ మంచి జేస్తున్నడు. గప్పడు, గిప్పుడు తేడా ఏంటిదన్నది ఒక్క రైతులకే తెల్తది.
-ఒడ్డె రామానుజం, రైతు, గుడిపేట, హాజీపూర్, మంచిర్యాల జిల్లా
అందుబాటులో ఎరువులు ఉన్నాయి..
మంచిర్యాల జిల్లాకు అవసరమైన యూరియా, డీఏపీ, కాంప్లెక్స్, పొటాష్ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు ఎరువులు రాగా.. ఇంకా.. విడతలవారీగా రేక్లు రానున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే నిల్వలు ఉంచుతున్నాం. ఎరువుల కోసం ఒక్క రైతు కూడా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో వరుసగా వివిధ కంపెనీల నుంచి వ్యాగన్లు రానున్నాయి. రైతులు ఒకేసారి పదుల సంఖ్యలో ఎరువుల బ్యాగులు తీసుకోకుండా విడతలవారీగా అవసరం మేరకు తీసుకెళ్లాలి. అతిగా కాకుండా వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన విధంగా వాడాలి.
– ప్రవీణ్ రెడ్డి, మార్క్ఫెడ్ డీఎం, మంచిర్యాల.
గోస తీరింది..
తెలంగాణ రాష్ట్రం అచ్చినంకనే ఎరువు లు, విత్తనాల గోస తీరింది. అంతకు మునుపు అరిగోస పడ్డం. పంట పండించుడు ఒక ఎత్తయితే.. ఎరువులు దొరకడం మరో ఎత్తు అన్నట్లు ఉంటుండె. రోడ్ల మీదికి అచ్చి ధర్నాలు కూడా చేసినం. ఎన్ని చేసినా అప్పట్లో రైతులను నాటి పాలకులు పట్టించుకోలె. నాకు సిద్దపురం శివారు, కౌట్ల(కే)లో ఆరెకరాల పొలం ఉన్నది. యాసంగి, వానకాలంలో రెండు కాలాలు వరి పండిస్త. పంటకు యూరియా, డీఏపీ, పొటాష్ వేయాల్సి ఉంటుంది. ఈ ఎరువులు కావాలంటే గతంలో వ్యవసాయ ఆఫీసుల చుట్టూ తిరిగేది. ఆఫీసర్లు కూపన్లు రాసి ఇస్తేనే ఎరువులు దొరికేవి. అది కూడా మనిషికి రెండు బస్తాలు మాత్రమే. ఆ కూపన్లతో ఎరువుల దుకాణం కాడ లైన్ కడుతుంటిమి. ఇలా కూపన్ల కోసం ఆఫీసుల పొంటి.. ఫర్టిలైజర్ దుకాండ్ల కాడ రోజంతా నెరివడుతుంటిమి. అయినా కావల్సిన ఎరువులు దొరికేవి కావు. వాళ్లు ఇచ్చినంత తెచ్చుకొని పొలంలో చల్లేది. ఎప్పుడో ఒక గంటసేపు వచ్చే కరెంటుతో అటు నీళ్లు పారక, ఇటు ఎరువులు సరిపోక.. పంట దిగుబడులు కూడా అంతంత మాత్రంగానే వచ్చేవి. పంట అమ్ముకోగా వచ్చిన పైసలతో పెట్టుబడికి చేసిన అప్పులు కూడా తీరేవి కావు. కానీ.. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎవుసం బాగుపడ్డది. ఎరువులు, విత్తనాల కోసం లైన్లో నిలబడే బాధ లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని సంచులు కావాలన్నా వెంటనే దొరుకుతున్నయ్. పెట్టుబడి సాయం కూడా అందుతున్నది. 24 గంటల పాటు కరెంటు వస్తున్నది. ఉన్న ఆరెకరాల పొలంలో మూడెకరాలు బోరు కింద సాగవుతుండగా, మరో మూడెకరాలు స్వర్ణ వాగు నీటితో పండిస్తున్న. సీఎం కేసీఆర్ సల్లని చూపుతో రైతుల జీవితాలు బాగుపడ్డయ్. – కొట్టాల అశోక్, రైతు, కౌట్ల(కే), నిర్మల్ మండలం.
ఉన్న ఊళ్లనే రైతుబంధు డబ్బులు డ్రా
ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులను రెండు రోజులుగా జమ చేస్తున్నది. దీంతో మారుమూల గ్రామాల్లో సీఎస్పీలు( బ్యాంకు మిత్రలు ) బయోమెట్రిక్తో నగదు ఇస్తున్నారు..భీంపూర్ మండలకేంద్రం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరంజి(టి) సహా మిగతా గ్రామాల్లో పోస్టాఫీస్, సీఎస్పీ సిబ్బంది ఈ సేవలు అందిస్తున్నారు. బ్యాంకులకు వెళ్లే అవసరం లేకుండా ఇక్కడే డబ్బులు తీసుకోవడం బాగుందని లబ్దిదారు,మహిళా రైతు చెరుపుల పార్వతీబాయి చెబుతూ సంతోషం వ్యక్తం చేశారు.ఇక ఆనారోగ్యంతో ఉన్న రైతుల చెంతకే వెళ్లి డబ్బులు అందజేస్తున్నారు. ఇప్పుడు ఈ గ్రామాల్లో రైతుబంధు కళ కనిపిస్తున్నది.
ఎరువులు దొరుకుతున్నయ్..
మా ఊరి శివార్ల ఎనిమిదెకర్ల ఎవుసం ఉంది. మొన్ననే మా సొసైటీకి లారీలల్ల ఎరువుల బ్యాగులు వచ్చినయ్. ఎవుసందారులందరికీ యూరియా, డీఏపీ ఇచ్చిన్రు. నేను గూడ 18 బస్తాలు తీసుకచ్చుకున్న. సీఎం కేసీఆర్ సారు సీఎం అయినప్పటి సంది ఎరువులకు బాధలేకుండయింది. అంతకముందయితే దినం, రాత్రుళ్లు లైన్లన్ల నిలబడినా దొరుకకపోయేటివి. సానా ఇబ్బంది పడ్డం. గిప్పుడైతే ఆ బాధలు తప్పినయ్. ఇలా పోంగనే అలా ఇస్తున్నరు. ఇదంతా సీఎం కేసీఆర్ చలువే. ఆయన పదికాలాల పాటు సల్లంగుండాలె. – అంగ గోపాల్యాదవ్, రైతు, గుబ్డి, భీంపూర్ మండలం
కేంద్రంలోని మోదీ సర్కారు ఎరువుల ధరలు పెంచి రైతుల నడ్డి విరుస్తున్నది. విత్తనాలు, ఎరువుల రేటు పెంచడంతో ఎకరానికి రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు అయ్యే ఖర్చు, రూ.1000 నుంచి రూ.2వేల వరకు అదనంగా అవుతున్నాయి.
పొటాష్(ఎంవోపీ) పాత ధర రూ.850 ఉంటే.. ప్రస్తుతం రూ.1,700 దాటింది. దీంతో ఒక్క ఆ ఎరువు మీదే రూ.850 భారం అవుతున్నది. కేంద్రం 50 శాతం మేర పెంచడంతో భారం అవుతున్నది.
అందుబాటులో ఎరువులు..
మంచిర్యాల జిల్లాలో యూరియా 6,850 మెట్రిక్ టన్నులు, డీఏపీ 800 టన్నులు, కాంప్లెక్ 4,350 మెట్రిక్ టన్నులు.. నిర్మల్లో యూరియా 9,200, డీఏపీ 2,350, కాంప్లెక్స్ 4,650 మెట్రిక్ టన్నులు.. ఆదిలాబాద్లో యూరియా 9,013, డీఏపీ 5,525, కాంప్లెక్స్ 127 టన్నులు.. ఆసిఫాబాద్ జిల్లాలో 25 వేల పైచిలుకు మెట్రిక్ టన్నుల స్టాక్ అందుబాటులో ఉంది.