మంచిర్యాలటౌన్, ఫిబ్రవరి 10 : మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకోసం ఆర్టీసీ సన్నద్ధమైంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. మంచిర్యాల జిల్లాలోని ఐదు ప్రాంతాల నుంచి మేడారం జాతరకు బస్సులను నడిపించనున్నది. మహాలక్ష్మీ పథకం నేపథ్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో జాతరకు తరలివెళ్లనుండగా, అందుకనుగుణంగా బస్సుల సంఖ్యను కూడా పెంచాలని నిర్ణయించింది. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే భక్తులు కూడా మంచిర్యాల జిల్లా మీదుగా మేడారానికి తరలి వెళ్లనున్నారు.
ఇక్కడ సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతాలు విస్తరించి ఉండడం, సమ్మక్క-సారలమ్మలను తమ ఇష్టదైవాలుగా కొలిచే భక్తులు అధికంగా ఉన్నారు. వీటన్నిం టినీ దృష్టిలో పెట్టుకొని ఇతర డిపోల నుంచి కూడా బస్సులను ఇక్కడికి తీసుకురానున్నారు. జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల, శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, చెన్నూరు బస్టాండుల నుంచి మేడారానికి బస్సులు నడుపనున్నారు. ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు జాతరకు బస్సులు నడిపించనున్నారు. బస్టాండుకు పక్కనే ఉన్న జడ్పీ బాలుర పాఠశాల మైదానం నుంచి బస్సులను పంపించనున్నారు. టికెట్ల కౌంటర్లు అక్కడే ఏర్పాటు చేయనున్నారు. నిత్యం బస్టాండ్ నుంచి వెళ్లే సాధారణ ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు.
మిగిలిన శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, చెన్నూరులలో ఆర్టీసీ బస్టాండుల నుంచే బస్సులను నడుపనున్నారు. మంచిర్యాల డిపో నుంచి 110 ఆర్టీసీ బస్సులతో పాటు 30 హైర్ బస్సులను మేడారానికి నడిపించనున్నారు. చెన్నూ రు బస్టాండు నుంచి ఆదిలాబాద్ డిపోకు చెందిన 65 బస్సులు, శ్రీరాంపూర్ బస్టాండునుంచి ఉట్నూర్, భైంసా డిపోలకు చెందిన 45 బస్సులు, మందమర్రి బస్టాండునుంచి నిర్మల్ డిపోకు చెందిన 65 బస్సులు, బెల్లంపల్లి బస్టాండు నుంచి ఆసిఫాబాద్డిపోకు చెందిన 50 బస్సులను మేడారం వెళ్లే భక్తుల కోసం నడిపిస్తారు. మంచిర్యాల నుంచి మేడారానికి పెద్దలకు రూ.410, పిల్లలకు రూ. 220 చార్జీలు వసూలు చేస్తారు. శ్రీరాంపూర్ నుంచి పెద్దలకు రూ. 400, పిల్లలకు రూ. 210, మందమర్రి నుంచి పెద్దలకు రూ.450, పిల్లలకు రూ. 250, బెల్లంపల్లి నుంచి పెద్దలకు రూ. 460, పిల్లలకు రూ. 250, చెన్నూరు నుంచి పెద్దలకు రూ. 420, పిల్లలకు రూ. 230 వసూలు చేస్తారు.
మేడారం జాతరకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. 18వ తేదీ నుంచే మేడారానికి బస్సులు నడుపుతాం. 20వ తేదీనుంచి రద్దీ పెరిగే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా బస్సులను నడిపిస్తాం. గతేడాది కంటే ఈసారి 50 వరకు బస్సులను ఎక్కువగా నడిపించాల్సి వస్తుందని అనుకుంటున్నాం. సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని భక్తులను కోరుతున్నాం.
– రవీంద్రకుమార్, మంచిర్యాల డిపో మేనేజర్