మంచిర్యాలటౌన్, నవంబర్ 24 : అభివృద్ధి, సంక్షేమం విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. ‘ఇంటింటికీ టీఆర్ఎస్’ కార్యక్రమంలో భాగంగా గురువారం మంచిర్యాలలోని 13వ వార్డు పరిధిలోని హమాలీవాడ, సప్తగిరి కాలనీలో ఆయన పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా? అని ఆరా తీశారు. ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత్, పారిశుధ్య సమస్యలను ఏకరువు పెట్టారు. త్వరితగతిన నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని ప్రజలు కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన కాలనీల అభివృద్ధికి కాస్త సమయం పడుతుందన్నారు. ఒక్కొక్కటిగా పనులు చేస్తామని, ప్రజలు కాస్త ఓపిక పట్టాలని కోరారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నామని, ఉన్న నిధులను అన్ని ప్రాంతాలకు కేటాయించాల్సి వస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, పీఏసీఎస్ చైర్మన్ సందెల వెంకటేశ్, వార్డు కౌన్సిలర్ నల్ల శంకర్, టీఆర్ఎస్ నాయకురాలు అత్తి సరోజ, పట్టణాధ్యక్షుడు పల్లపు తిరుపతి, శ్రీపతి వాసు, జెట్టి శంకర్, జెట్టి చరణ్దాస్, పానగంటి శ్రీనివాస్, రవీందర్రావు, అగ్గు రవి పాల్గొన్నారు.
రూ. 9.21 కోట్లతో గిరిజన గ్రామాలకు బీటీ రోడ్లు
మంచిర్యాల నియోజకవర్గంలోని దండేపల్లి, హాజీపూర్, లక్షెటిపేట మండలాల్లోని గిరిజన గ్రామాలకు రూ.9.21 కోట్ల గిరిజన సంక్షేమ శాఖ నిధులతో బీటీ రోడ్లు వేయనున్నట్లు ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ నుంచి ఈ నిధులు మంజూరయ్యాయని, వీటితో గిరిజన గ్రామాలకు బీటీ రోడ్లు వేయనున్నట్లు పేర్కొన్నారు. దండేపల్లి మండలంలో ఆర్అండ్బీ రోడ్డు నుంచి పాత మామిడిపల్లి మీదుగా ఊట్ల గ్రామం వరకు ఐదు కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ.3.50 కోట్లు, పీఆర్ రోడ్ నుంచి కంచరబావి (మామిడిపల్లి) వరకు రెండున్నర కిలోమీటర్ల రోడ్డుకు రూ.46 లక్షలు, ఐటీడీఏ ట్రైబల్ వెల్ఫేర్ రోడ్డు నుంచి నాయికపుగూడ (తాళ్లపేట) వరకు రెండు కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ.42 లక్షలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. పీఆర్ రోడ్డు నుంచి కుంటాలగూడ (తాళ్లపేట) వరకు 4.80 కిలోమీటర్ల రహదారి కోసం రూ.74 లక్షలు వెచ్చించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
హాజీపూర్ మండలంలో పీఆర్ రోడ్డు నుంచి కోలామ్గూడ వరకు ఒక కిలోమీటర్ రహదారి నిర్మాణానికి రూ.65 లక్షలు, మొర్రిగూడ గ్రామం నుంచి టీకనపల్లి గ్రామం వరకు కిలోమీటర్ రహదారి నిర్మాణానికి రూ.కోటి, లక్షెటిపేట మండలంలో పీఆర్ రోడ్డు నుంచి తలమల్ల (జెండావెంకటాపూర్) వరకు 8.10 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ.1.22 కోట్లు, హన్మంతుపల్లి నుంచి చల్లంపేట (చందారం) వరకు 8.1 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ.1.22 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వివరించారు. ఈ పనులకు ప్రస్తుతం టెండర్ ప్రక్రియ మొదలవుతుందని, వెంటనే ప్రారంభించి పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బీటీ రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్కు ఎమ్మెల్యే దివాకర్రావు కృతజ్ఞతలు తెలిపారు.