హాజీపూర్, ఆగస్టు 24: మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లాలో మొదటి విడుతగా చేపట్టిన అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ భారతీ హోళికేరి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్తో కలిసి జిల్లా అధికారులు, ఇంజినీరింగ్ విభాగాల అధికారులతో సమావేశమయ్యారు. మన ఊరు- మన బడి అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్యక్రమంలో భాగంగా ఎంపికైన పాఠశాలల్లో కొనసాగుతున్న పనులను ప్రధానోపాధ్యాయులు, ఇంజినీరింగ్ అధికారులు, మండల విద్యాధికారులు సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
పనుల వివరాలను స్థాయిల వారీగా ఫొటోలను తీసి సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు. పాఠశాలల భవనాలు క్రమ పద్ధతిలో ఉండే విధంగా రూపకల్పన చేయాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని ఆయా మండలాల్లో గ్రామాల వారీగా జరుగుతున్న పనులను ప్రత్యేకాధికారులు, మండల విద్యాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఈవో వెంకటేశ్వర్లు, పంచాయతీ రాజ్ ఈఈ జాదవ్ ప్రకాశ్, రోడ్లు, భవనాల శాఖ ఈఈ రాము, వివిధ శాఖల అధికారులు, ఇంజినీరింగ్ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.