మంచిర్యాల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంకుపై ఉన్న సిమెంట్ బిల్లా కూలిపోవడంతో సీసీసీ టౌన్ షిప్ కు చెందిన పల్లెకొండ సురేష్ (28)మృతి చెందాడు. సురేష్ సెప్టిక్ ట్యాంకులు శుభ్రం చేసే పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. రోజువారి లాగే ఆదివారం నస్పూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని మార్టిన్ గ్రామర్ పాఠశాల సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేయడానికి మరో వ్యక్తితో కలిసి వెళ్లాడు.
పాఠశాలలో సెప్టిక్ ట్యాంకులు శుభ్రం చేస్తున్న క్రమంలో సెప్టిక్ ట్యాంక్ పైన ఉన్న సిమెంట్ బిల్లా కూలి అతనిపై పడింది. దీంతో ఆయన శరీరానికి బలమైన గాయాలు తగిలి మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతుడికి భార్య శిరీష ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిరుపేదైన సురేష్ కుటుంబానికి పాఠశాల యాజమాన్యం ఆర్థిక సాయం అందించాలని బంధువులు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.