మంచిర్యాల : ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అధికారులను ఆదేశించారు. ఆసరా పెన్షన్లు, దళితబంధు, పోడు భూములకు సంబంధించి నస్పూర్ సీసీ గెస్ట్ హౌస్ లో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పలు గ్రామాల్లో మిగిలి ఉన్న ఎఫ్ఆర్సీ కమిటీలను పూర్తి చేయాలన్నారు. పంచాయతీరాజ్,ఆర్ అండ్ బీ ఎన్హెచ్ 63 రోడ్లకు సంబంధించిన అటవీ అనుమతులు, ఇతరత్రా ఇబ్బందులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
2014 ముందు వరకు అటవీ భూములను సాగు చేసుకున్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు రానీయొద్దన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్లాంటేషన్ దెబ్బతినకుండా, అటవీ సంబంధిత అంశాలపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.
రైతు భూములకు సంబంధించి నెలకొన్న సమస్యలపై రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలన్నారు.
మారుమూల గ్రామాల్లో అంత్యక్రియల సమయంలో స్థానిక పనులకు మట్టి, పశుగ్రాసం కోసం కోసం అడవులకు వెళ్లే రైతులను మానవత్వంతో చూడాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే దివాకర్, ఎమ్మెల్సీ దండే విఠల్, కలెక్టర్ భారతి హొళికేరి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.