కోటపల్లి, ఆగస్టు 16: మంచిర్యాల జిల్లా కోటపల్లి (Kotapally) మండలంలో భారీ వర్షం కురుస్తున్నది. వర్షం కారణంగా వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి, ప్రాణహిత నదిలోకి కొత్తగా నీరు వచ్చి చేరుతుండడంతో నదులలో ప్రవాహం గంట గంటకు పెరుగుతోంది. కాగా భారీ వర్షాలతో కోటపల్లి పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రాణహిత, గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు నదుల వైపు చేపల వేటకు వెళ్లకూడదని.. నదులు, వాగులు, చెరువులు, కుంటలు, ఒర్రెలు దాటే ప్రయత్నం చేయకూడదని చెన్నూర్ రూరల్ సీఐ బన్సీలాల్, కోటపల్లి ఎస్ఐ రాజేందర్లు సూచించారు. విద్యుత్ ప్రమాదాల ముప్పుపొంచి ఉండటంతో విద్యుత్ తీగలు, స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లకు దగ్గరగా వెళ్లవద్దని, పశువుల కాపరులు పశువులతో అడవులు, వాగులు దాటి వెళ్లకుండా జాగ్రత్త వహించాలన్నారు.
మట్టి గోడలు, పాత ఇండ్లు, శిథిలావస్థకు చేరిన ఇండ్లలో నివసిస్తున్న వారు వెంటనే సురక్షిత ప్రాంతాలలో ఉండాలని పేర్కొన్నారు. కోటపల్లి మండలంలోని నక్కలపల్లి గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న వాగులు ప్రవచనంతో ఈ మార్గంలో ప్రయాణికులు వారి ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోటపల్లి ఎస్ఐ రాజేంద్ర సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే కోటపల్లి పోలీస్లను సంప్రదించాలని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, పుకార్లను నమ్మకుండా అధికారుల సూచనలు పాటించాలని కోరారు.