ఇంద్రవెల్లి, అక్టోబర్ 27 : ఆదివాసీ గిరిజనులు తమ సంస్కృతీ సంప్రదాయాలు పాటిస్తూనే పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అన్నారు. మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన దండారీ ఉత్సవాల ముగింపులో పీవో పాల్గొన్నారు. ముందుగా కేస్లాపూర్ గ్రామస్తులతోపాటు గుస్సాడీ బృందం ఆధ్వర్యంలో ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డికి ఘన స్వాగతం పలికారు. గ్రామపెద్దలతోపాటు మహిళలు, గుస్సాడీలు సన్మానించారు. ఏత్మాసూర్ పేన్ దేవతకు పీవో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దండారీ నృత్యాలను తిలకించి తన ఫోన్లో బంధించారు.
జెన్నీఫర్ రచించిన దండారీ ఉత్సవాల పుస్తకాలను విక్రయించగా వచ్చిన రూ.60వేల చెక్కును గుస్సాడీలతో పాటు గ్రామపెద్దలకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీ గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలు చాలా గొప్పవన్నారు. సంస్కృతిని కాపాడుతూనే పిల్లలు ఉన్నత స్థాయిల్లో ఉండేలా చూడాలని పేర్కొన్నారు. విద్యతోపాటు ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్నారు. పురాతన కాలం నాటి రాగులు, జొన్నలు, కొర్రలు, గట్కా లాంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్నారు. నాగోబా జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేస్లాపూర్ గ్రామపటేల్ మెస్రం వెంకట్రావ్పటేల్, సర్పంచ్ మెస్రం రేణుకానాగ్నాథ్, నాగోబా ఆలయ పూజారి మెస్రం షేకు, గ్రామస్తులు బాధిరావ్ పటేల్, జంగు బాపు, ఆనంద్రావ్, చిన్నుపటేల్, లింబారావ్, నాగ్నాథ్ తదితరులు పాల్గొన్నారు.