బెల్లంపల్లి,జనవరి 13 : పాల వ్యాపారం పేరిట రైతులను మోసం చేసిన అరిజిన్ డెయిరీ ఫాం ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ సంబంధిత కేసు వివరాలను శుక్రవారం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాకు చెందిన కందిమల్ల ఆదినారాయణ, బోడపాటి సెజల్ అలియాస్ నందిని తక్కువ కాలంలో ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాలనే ఉద్ధేశంతో పాల కేంద్రం పేరుతో అమాయక రైతుల నుంచి డబ్బులు దండుకుంటూ మోసం చేస్తున్నారు. ఇలాగే బెల్లంపల్లిలో కొంతమంది రైతులు, ప్రజలను పరిచయం చేసుకుని పశు శాఖ పై పట్టున్న చిలరపు సంతోష్, కుమ్మరి పోశంను భాగస్వాములుగా చేసుకొని పాల కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని స్థానికంగా ప్రచారం నిర్వహించారు. పాడి రైతుకు నామమాత్రంగా గేదేలు ఇస్తే మిగితా రైతులు కూడా డబ్బులు చెల్లిస్తారని పాల కేంద్రానికి భూమి పూజ చేసిన 2022 ఆగస్టు 11న తాండూర్కు చెందిన రైతుకు గేదెలను పంపిణీ చేశారు.
ఆ ఫొటోలతో నియోజకవర్గవ్యాప్తంగా మండలాల్లో తమ భాగస్వాములు, సిబ్బందితో అమాయక రైతుల నుంచి డబ్బులు వసూలు చేశారు. రైతులు 35 శాతం చెల్లిస్తే మిగితా 65 శాతం సంస్థ చెల్లిస్తుందని నమ్మించారు. పాలను కూడా తామే కొనుగోలు చేస్తామని 18 మంది రైతుల నుంచి సుమారు రూ.21లక్షల వరకు వసూలు చేశారు. కంపెనీలో సభ్యత్వం తీసుకుంటే పశువులు చనిపోతే రూ.50 వేలు పరిహారం చెల్లిస్తామని ఒక్కొక్క రైతు నుంచి రూ.708 చొప్పున వెయ్యి మంది రైతుల నుంచి రూ.ఏడు లక్షల 80వేలు సేకరించారు. డబ్బులు తీసుకున్న 45 రోజుల్లోపు పశువులు ఇస్తామని చెప్పిన నిందితులు పత్తా లేకుండా పోయారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు ఈనెల 11న పలు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. పోలీసులు బెల్లంపల్లి వన్టౌన్, టూ టౌన్, కాసిపేట, తాండూర్, నెన్నెల, జన్నారం, జైపూర్ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేశారు.
ఇవే గాకుండా ఆదిలాబాద్, వరంగల్, సూర్యాపేట జిల్లాల్లో కూడా రైతులను మోసం చేయాలని సమావేశాలు కూడాఏర్పాటు చేశారు.నోటీసులు ఇచ్చినా నిందితులు తప్పించుకొని తిరుగుతున్నారని డీసీపీ తెలిపారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం పోలీసులు బెల్లంపల్లి కొత్తబస్టాండ్ వద్ద నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఎన్డీ సూర్య మీడియా కార్డును చూపిస్తూ టోల్గేట్ల వద్ద, ఇతర అధికారులను బెదిరించిన ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఆది నారాయణ పై అత్తిలి, గుడివాడ, పంజాగుట్ట , మాదాపూర్ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. వీరి నుంచి సీపీయూ, డెస్క్ టాప్, కంపెనీ చెక్బుక్, కంపెనీ లెటర్ ప్యాడ్, ఐదు విస్టింగ్ కార్డులు, అగ్రిమెంట్ డాక్యుమెంట్స్, మొబైల్ ఫోన్, ఎన్డీ సూర్య మీడియా, గుర్తింపు కార్డు, ఖాళీ ప్రామిసరీ నోట్స్, స్టాంప్లు , సభ్యత్వ రిసిప్ట్ బుక్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేశ్, రూరల్ సీఐ బాబురావు, టూ టౌన్ ఎస్ఐ ఆంజనేయులు, తాళ్ల గురిజాల ఎస్ఐ రాజశేఖర్ను డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు.