చెన్నూర్, జనవరి 13: గ్రామాల్లో పారిశుధ్యం, పచ్చదనం పెంపు, మౌలిక సదుపాయాలు కల్పనలో భాగంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛ శుక్రవారం (గ్రీన్ ఫ్రైడే) కార్యక్రమాన్ని చెన్నూర్ నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీల్లో ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. రామకృష్ణాపూర్లోని తన స్వగృహంలో ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇటీవల నియోజకవర్గంలోని ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వివరించారు. గ్రామాల అభివృద్ధే దేశాభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తున్నదని వారికి తెలియ జేశారు. ఇందు కోసమే నియోజకవర్గంలో దైనందిన అధికారిక కార్యక్రమాలతో పాటుగా ప్రతి శుక్రవారం స్వచ్ఛ శుక్రవారం (గ్రీన్ ఫ్రైడే) కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
చెత్తా చెదారం, మురుగు కాలువల్లో పూడిక తొలగించి, పరిసరాలను శుభ్రం చేయడం, ఎవెన్యూ ప్లాంటేషన్, నర్సరీల నిర్వహణ, పిచ్చి మొక్కల తొలగింపు, విద్యుత్ దీపాల నిర్వహణ తదితర పనులను ప్రత్యేకంగా నిర్వహించాలని ఆదేశించారు. నర్సరీల ఏర్పాటు, మొక్కలు నాటడం, వైకుంఠధామాలు, డంప్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికల నిర్వహణ, ఇంటింటికీ చెత్త సేకరణ, మురుగు కాలువల్లో పూడికతీయడం, వీధులను శుభ్రం చేయడం, పాత ఇండ్ల శిథిలాలు, చెట్ల పొదలను తొలగించడం వంటి పనులు చేపట్టాలని ఆదేశించారు. నిరుపయోగంగా ఉన్న బోరుబావులను మూసి వేయాలని, రోడ్లపై గుంతలను పూ డ్చి వేయాలని, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలను శుభ్రం చేయాలని, వారసంతలు నిర్వహించే ప్రాంతాలను శుభ్రం చేయడం లాంటి పనులను నిర్వహించాలని సూచించారు. మౌలిక వసతుల కల్పన, అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమైన అంశమని ఈ కార్యక్రమంపై మరింత దృష్టి సారిస్తామని ప్రభుత్వ విప్ బా ల్క సుమన్ తెలిపారు. అన్ని రంగాల్లో చెన్నూర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
యజ్ఞంలా గ్రీన్ ఫ్రైడే..
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో ప్రజా ప్రతినిధులు, అధికారులు గ్రీన్ ఫ్రైడే కార్యక్రమాన్ని యజ్ఞంలా చేపట్టారు. ఈ కార్యక్రమంతో నియోజకవర్గంలోని గ్రామాల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పారిశుధ్య పనులు ముమ్మరంగా నిర్వహిస్తూ, హరితహారంలో నాటిన మొక్కలను రక్షించేందుకు నీటిని అందిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహిస్తామని ప్రజా ప్రతినిధులు, అధికారులు తెలిపారు.