మంచిర్యాల : దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న రైతుబంధు విశిష్టతను తెలుపుతూ ప్రముఖ లైవ్ డ్రాయింగ్ ఆర్టిస్ట్ వేల్పుల పోచన్న వేసిన చిత్రాలు భళా అనిపించాయి. రైతుబంధు వారోత్సవాలలో భాగంగా కోటపల్లి రైతువేదికలో చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో చెన్నూర్ పట్టణానికి చెందిన ప్రముఖ ఆర్టిస్ట్ వేల్పుల పోచన్న గీసిన చిత్రాలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు చెక్కు పంపిణీతో పాటు, రైతుబంధు రైతన్నలకు ఏవిదంగా అండగా ఉంటుందనే వివరణ ఇస్తూ గీసిన చిత్రం అందరి ప్రశంసలను అందుకుంది. ఈ సందర్భంగా వేల్పుల పోచన్న.. రైతులకు చిత్రలేఖనంలోని మెళకువలు, ప్రాధాన్యత వివరించడంతో పాటు రైతుబంధు ప్రాముఖ్యతను వివరించారు.
చిత్రలేఖనం గురించి.. దాని గొప్పదనం గురించి దేశమంతా అవగాహన కల్పించేందుకు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కళాయాత్రను నిర్వహిస్తున్నానని పోచన్న చెప్పారు. నాలుగు సంవత్సరాలలో ఇప్పటి వరకు 18 రాష్ట్రాలను చుట్టు వచ్చానని, ఏ రాష్ట్రంలో కూడా రైతులకు పెట్టుబడి సాయం అందించి రైతన్నల వ్యవసాయాన్ని ప్రోత్సహించిన ప్రభుత్వం లేదన్నారు. రైతుబంధు గొప్ప పథకం అని, తాను వెళ్లిన ప్రతి రాష్ట్రంలో రైతుబంధు ప్రాముఖ్యతను వివరిస్తానని పోచన్న చెప్పారు. రైతుబంధు ప్రాముఖ్యతను చిత్రాల ద్వారా వివరించిన పోచన్నను మండల వ్యవసాయ శాఖ అధికారి మహేందర్, రైతుబంధు మండల కన్వీనర్ గుర్రం రాజన్న, సర్పంచ్ రాగం రాజక్క, ఏఈఓలు, రైతుల ఆధ్వర్యంలో సన్మానించారు.