బెల్లంపల్లి టౌన్ : తలసేమియాతో బాధపడుతున్న వారికి అండగా నిలుస్తూ రక్తదానం చేయడం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలో ఏసీపీ ఎడ్ల మహేశ్ ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రక్తదాతలకు ప్రశంసాపత్రాలు అందించిన అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడుతూ విధి నిర్వహణలో అసువులు బాసిన వారి సేవలు మరువలేనివని కొనియాడారు.
ఏసీపీ ఎడ్ల మహేశ్ మాట్లాడుతూ బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలో మెత్తం 1045 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు పేర్కొన్నారు. రక్తదాన శిబిరంలో పెద్ద మొత్తంలో ప్రజలు, పోలీసు సిబ్బంది రక్తదానం చేయడం అభినందనీయ మన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, ఏఎంసీ చైర్పర్సన్ గడ్డం పావణీ కళ్యాణి, నియోజకవర్గ అధికార ప్రతినిధి కొమ్మెర లక్ష్మణ్, నాయకులు నెల్లికంటి శ్రీనాథ్, గడ్డం భీమగౌడ్, సీఐలు జగదీశ్, ముస్కె రాజు, కోట బాబురావు, ప్రమోద్ రావు , ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.