కాసిపేట, ఏప్రిల్ 10 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం సోమగూడెం సర్వే నెంబర్ 3లో అక్రమ నిర్మాణాల తొలగింపు, భూమి స్వాధీనానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఈ నెల 8న హైకోర్టు ఆదేశాలతో కూల్చివేతకు వచ్చిన కోర్టు, పోలీసు, రెవెన్యూ సిబ్బందిని గృహాల యజమానులు, స్థానికులు అడ్డుకున్నారు. దీంతో కోర్టులో ఈ భూమి హక్కుదారుగా నెగ్గిన భూ హక్కుదారుకు రూ. కోటి పరిహారం ఇచ్చేందుకు ఇరువర్గాల నాయకుల మధ్యవర్తిత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో గురువారం కోర్టు అధికారులను పిలిచి బుధవారం జరిగిన కూల్చివేతల అంశంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
శుక్రవారం(ఏప్రిల్10) కూల్చివేతలకు పోలీసు బందోబస్తుతో సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు సమాచారం.
దీంతో ఇళ్ల యజమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఇరు వర్గాల మధ్య బెల్లంపల్లి గురువారం రాత్రి 9గంటలు దాటినా చర్చలు కొనసాగాయి. సోమగూడెంలో కూల్చివేతల అంశం చర్చనీయాంశంగా మారింది. సర్వే నంబర్ 3పైకి ప్రభుత్వ లావణి పట్టా భూమి కాగా క్రయ విక్రయలు చేసుకునేందుకు అవకాశం లేదని, ఇది ఎలా సెటిల్మెంట్ చేసుకుంటారని వాదన ఉంది. కేవలం కేసు వాపస్ తీసుకోవడం తప్ప అధికారికంగా సెటిల్మెంట్ చేసుకునే అవకాశం లేదని తెలుస్తుంది. కాని తర్వాత మళ్లీ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రాంతం లావన్ పట్టా కాగా స్థానిక నాయకులతో పాటు పలువురు ఎటువంటి సరైన పత్రాలు లేకుండా విక్రయించారు.
తక్కువ ధరకు వస్తుందని ఆశ చూపడంతో తెలియక అమాయకులు విక్రయించి ఇల్లు నిర్మాణం చేసుకున్నారు. ఈ భూమిపై రాం కిష్టయ్య కుటుంబం కోర్టుకు తమ భూమిగా వెళ్లగా అన్ని ఋజువులు కావడంతో కష్టయ్య కుటుంబం భూమిగా తేల్చడంతో ఇక ఆ భూమి స్వాధీనం చేసుకొని వారికి ఇచ్చేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇటీవల అడ్డుకోగా మళ్లీ శుక్రవారం చర్యల కోసం అధికారులు చూస్తుండగా ఏం జరుగుతుందా అని ఉత్కంఠ నెలకొంది.