కాసిపేట, జూన్ 24 : అసలే వర్షాకాలం.. నీరు రోడ్డుపై ప్రవహిస్తుంటే వాహనదారులు వెళ్లడానికి ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. కానీ అదే వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోయి అలాగే ఉంటే ఇంకెంత ఇబ్బందులు ఎదురవుతాయి. మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలో ప్రధాన రోడ్డుపై మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు గుంతల్లో భారీగా వరద నీరు చేరి ప్రయాణికులకు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది. వర్షం పడినప్పుడల్లా ఇదే పరిస్థితి నెలకొంటుంది. వర్షపు నీరు అంతా రోడ్డుపై చేరి చిన్న చెరువును తలపిస్తుంది.
ఇబ్బందుల మధ్య రహదారిపై వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.
కేవలం ఒక్కరోజు రాత్రి కురిసిన వర్షానికి ఇంత దారుణమైన పరిస్థితి వస్తే ముందు ముందు రాబోయే వర్షాలకు ఏలాంటి పరిస్థితి ఎదురవుతుందోనని ప్రయాణికులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఎన్ని సార్లు రోడ్డు కోసం ఆందోళనలు చేసిన పట్టించుకునే దిక్కు లేక అద్వానపు రహదారితో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే రోడ్డను మరమ్మతు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.