తాండూర్, మార్చి 24 : పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పీ చంద్రయ్య అధికారులను ఆదేశించారు. ప్రగతి ప్రణాళికా కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను మంగళవారం డీఎల్పీవో సతీషకుమార్, స్థానిక అధికారులు, నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా పరిశీలించారు. పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ తీరును పరిశీలించి శుభ్రత పనుల నిర్వహణ తీరుపై స్థానిక ప్రజలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కాలనీలలో పర్యటిస్తూ పారిశుధ్య పనులు, ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ పనులు, నర్సరీ పరిశీలించారు. గ్రామంలోని ప్రతి సైడ్ డ్రెయిన్ శుభ్రంగా ఉండాలని అవసరం అయితే కూలీలను పెంచుకోవాలన్నారు.
ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ లను ప్రతి పదిరోజులకు ఒక సారి శుభ్రపరచాలని, వైపులైన్ లీకేజీలు లేకుండా చూడాలని, వీధి దీపాలు పగలు వెలగకుండా చూడాలని, ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులతో ఇండ్లు నిర్మాణం త్వరగా పూర్తి చేయించాలని, ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కోరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ జ్యోత్స్న, ఎంపీవో అనిల్ కుమార్, సర్పంచ్ ముడిమడుగుల సురేష్, పీఆర్ ఏఈ సాయిలత, వ్యవసాయ అధికారిని సుష్మా, కార్యదర్శి దివాకర్, ఉపసర్పంచ్ కుమ్మరి సత్యనారాయణ, మాజీ ఎంపీపీ సిరంగి శంకర్, నాయకులు ఎండీ ఈసా, ఆర్ ఐ ఎజాజోద్దీన్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.