ఖానాపూర్ రూరల్, జూన్ 23: ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇతర రాష్ర్టాలకు భిన్నంగా మన ఊరు-మన బడిలో కొత్త పాఠశాలలను నిర్మిస్తు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు బాటలు వేస్తున్నది. ఏ ప్రభు త్వం పాలనలోనైనా వైద్యంతో పాటు విద్యను సక్రమంగా అమలు చేస్తూ ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రజలు కోరుకుంటారు. ప్రజల ఆకాంక్షలకు అనుగునంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ, ఇంటింటికీ సంక్షేమ ఫలాలను అందజేస్తున్నది. ఖానాపూర్ మండలం సత్తనపల్లిలోని జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రాథమిక పాఠశాలలు అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయి. ఈ పాఠశాలను అధికారులు మన ఊరు -మన బడిలో ఎంపిక చేశారు.
సత్తనపల్లిలోని జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి రూ. 24 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో డైనింగ్ హాల్, టాయిలెట్ల నిర్మాణం, తాగు నీటివసతి, విద్యుత్ సౌకర్యం, ఫర్నిచర్తో పాటు ఇతర మౌలిక వసతులు కల్పించారు. రూ. 4.5లక్షలతో మొదటి విడుత పనులను పూర్తి చేశారు. పాఠశాల భవనాలకు రంగుల వేసి అందమైన, విశాలమైన గదుల్లో ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. పాఠశాలలో అన్ని తరగతులకు సరిపడా గదులతో పాటు అదనంగా గదులను నిర్మించారు. ఇప్పటికే సత్తనపల్లి పాఠశాలలో డిజిటల్ తరగతుల నిర్వహణకు మూడు ఎల్ఈడీలు (75 ఇంచులు)పాఠశాలకు చేరాయి. రేపో మాపో ఆన్లైన్ బోధనను సైతం ప్రారంభించనున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు.
మెరుగైన విద్యకు సమూలమైన మార్పులు
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అం దించి, రూపు రేఖలు సమూలంగా మార్చేందుకు మన ఊరు-మన బడి పథకాన్ని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు మనబడిలో అన్నిరకాల మౌలిక వసతులు కల్పిస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను గుర్తించి మరమ్మతులకు నిధులు మంజూరు అభివృద్ధి చేస్తున్నారు. పాఠశాలల్లో ఆన్లైన్ క్లాసుల నిర్వహణకు ఎల్ఈడీ టీవీలను అందజేస్తున్నారు. దీంతో తల్లితండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు సైతం ప్రభుత్వ పాఠశాలలో చేరి విద్యనభ్యసిస్తున్నారు.
– వాల్గొట్ శ్రీనివాస్, సత్తనపల్లి హెచ్ఎం
గతంలో పట్టించుకోలే
గతంలో పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరి గదులు అధ్వానంగా మారాయి. అప్పటి అధికారులు, పాలకులు సర్కారు స్కూళ్లను పట్టించుకోలేదు. విద్యార్థులకు తరగతి గదులు లేక ఇబ్బందులు పడ్డారు. తరగతి గదులు లేక చెట్ల కిందనే ఉపాధ్యాయులు పాఠా లు చెబుతుండేవారు. గదులు ఉన్నా అవి ఎప్పుడు కూలుతాయోనని భయంభయంగా బోధించేవారు. నాటి పాలనలో పాఠశాల మొత్తానికి ఒకటి, రెండు రూములుంటే వాటిలోనే అన్ని తరగతులు నిర్వహించేవారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు మన ఊరు-మన బడి పథకానికి శ్రీకారం చుట్టి గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసింది.
– తిరుమలేశ్, సత్తనపల్లి