ఎదులాపురం, మార్చి 5 : జిల్లాలో గంజాయిని పూర్తిగా నిర్మూలించడమే ప్రధాన లక్ష్యమని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాలను సమూలంగా నిర్మూలించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల పోలీస్ ఉన్నతాధికారులు, ఎక్సైజ్ అధికారులతో గతనెల సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి నిర్మూలన లక్ష్యంగా జిల్లా పోలీసులు పని చేస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు. జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్స్ సమావేశ మందిరంలో పోలీస్ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. తరుచుగా గంజాయి అమ్మేవారిపై నిరంతరం నిఘా ఉంచడం కోసం సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన అప్లికేషన్ (డీవోపీఏఎంఎస్) గురించి, దానివల్ల కలిగే ఉపయోగాలను జిల్లా అధికారులకు వివరించారు. ఈ అఫ్లికేషన్ ఉపయోగించి గతంలో మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న వారి వివరాలను పొందుపర్చనున్నట్లు పేర్కొన్నారు. అడిషనల్ ఎస్పీ (పరిపాలన) ఎస్. శ్రీనివాసరావు, పట్టణ డీఎస్పీ వెంకటేశ్వరావు, సీఐలు, ఎస్హెచ్వోలు, రైటర్స్, డీసీఆర్బీ, ఐటీకోర్ సిబ్బంది పాల్గొన్నారు.